హైదరాబాద్- బల్లెట్ బండెక్కి వచ్చేత్తాపా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. అందులోను మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ చేసిన డ్యాన్స్ తో ఈ పాట చాలా పాపులర్ అయ్యింది. బుల్లెట్ బండి సాంగ్ కు నవ వధువు చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో తప్ప మరేం లేదంటే అతియోశక్తి కాదేమో.
ఇక తన డ్యాన్స్ ఇంతలా ఫేమస్ అవుతుందని ఊహించలేదని. చాలా సంతోషంగా ఉందని పెళ్లి కూతురు సాయిశ్రియ సంతోషం వ్యక్తం చేసింది. ఇక బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన నవ నధువుకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బుల్లెట్టు బండి పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చిందా యువతికి.
మంచిర్యాల జిల్లాకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయకు, ఆకుల అశోక్ కు ఈనెల 14వ తేదీన పెళ్లి జరిగింది. అప్పగింతల సమయంలో సాయి శ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఆమె డ్యాన్స్ చేసిన బుల్లెట్ బండి పాటను బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ రూపొందించింది.
కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ డాన్స్ తో తమ పాట వైరల్ కావడంతో బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో ఫోన్లో మాట్లాడిన నిరూప, తమ సంస్థలో తదుపరి రూపొందించే పాటకు డ్యాన్స్ చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఊహించని రీతిలో తనకు దక్కిన అవకాశంతో సాయిశ్రీయ సంతోషం వ్యక్తం చేసింది. ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ఆఫర్ కు ఓకే చెప్పేసింది.