ఈ కాలంలో పెళ్లి అనేది కొంతమంది మగాళ్ల విషయంలో తీరని ఆశగా మిగిలిపోతోంది. పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు దొరకటం లేదు. సంబంధాలు చూసి, చూసి విసిగిపోయిన కర్ణాటకలోని మండ్యా జిల్లాకు చెందిన కొంతమంది యువకులు వినూత్న పనికి తెరతీశారు..
పెళ్లికి పిల్ల దొరకటం అంటే ఇప్పుడు ప్రపంచ యుద్దం చేసినంత పరిస్థితి ఉంది. కనీసం చనిపోయేలోగానైనా పెళ్లి అవుతుందా? అన్న బాధలో కొన్ని వేల మంది బ్రహ్మచారులు ఉన్నారు. ఇక, జీవితంలో పెళ్లి కాదు… జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఈ పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ముఖ్యంగా కొన్ని కులాల్లో ఆడపిల్లలు బొత్తిగా కరువయ్యారు. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకే పెళ్లి కాని కొంతమంది బ్రహ్మచారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200 మంది బ్రహ్మచారులు పాదయాత్ర చేపట్టాలని నిశ్చయించుకున్నారు.
ఈ పాదయాత్ర మాండ్య జిల్లానుంచి చామరాజనగర జిల్లాలోని ఎమ్ఎమ్ హిల్స్ టెంపుల్ వరకు సాగనుంది. ఫిబ్రవరి 23న పాదయాత్ర మొదలుకానుంది. 30 ఏళ్లు పైబడ్డవారు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్ర ఎమ్ఎమ్ హిల్స్ టెంపుల్ దగ్గర ముగియనుంది. ఆ 200 మంది బ్రహ్మచారులు ఎమ్ఎమ్ హిల్స్ గుడిలో దేవుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పెళ్లి చేసుకోవటానికి తమకు ఎలాగైనా మంచి అమ్మాయిలను ఇవ్వమని కోరనున్నారు. కాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు.
ఒకప్పుడు భ్రూణ హత్యలు విపరీతంగా జరిగేవి. దీంతో ఇప్పుడు ఆడపిల్లల కరువు వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే వారికి ఆడపిల్లలు దొరకటం లేదు. చదువుకున్న వారికి కూడా అమ్మాయిలు దొరకటం లేదు. ఉన్న ఆడపిల్లల ఆశల్ని అందుకోవటం సగటు మగపిల్లవాడికి సాధ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలోనే వందల మంది బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. అంతేకాదు.. పెళ్లి కావటం లేదన్న బాధతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.