తల్లిదండ్రులు బిడ్డలకు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసిన తల్లిదండ్రులకు ఏం చేసినా రుణం తీరనిది. అయితే ఓ కుమారుడు మాత్రం తనవంతుగా తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు.
ఈ భూమి మీద తల్లిదండ్రుల ప్రేమకు మించి విలువైనది ఏమిలేదు. బిడ్డను నవ మోసాలు మోసి కని పెంచుతుంది తల్లి. తాను అర్థాకలితో ఉండి బిడ్డల కడుపును నింపుతుంది. అలానే తన ఆశలను, కలలను చంపుకుని పిల్లల కోసమే జీవిస్తుంది. ఎన్నో కోరికలు ఉన్న బిడ్డల పెంపకంలో పడి వాటిని మరచిపోతుంది. అంతేకాక పిల్లల సుఖసంతోషాల కోసం నిత్యం తల్లి ఆరాటపడుతుంది. అలా పెంచి..పెద్ద చేసిన తల్లిని కొందరు పిల్లలు అత్యంత దారుణం చూస్తారు. కనిపెంచిన తల్లినే భారంగా భావిస్తున్నారు. అయితే కొందరు పుత్రులు మాత్రం తమ తల్లి మనస్సును అర్ధం చేసుకుని, ఆమె కోర్కెలను తీర్చేందు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ కుమారుడు మాత్రం 73 ఏళ్ల తన తల్లి కోసం ఓ సాహస యాత్రకే పూనుకున్నాడు. మరి.. ఆ వ్యక్తి ఎవరు.. అతడు చేసిన సాహసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రం మైసూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల రత్నమ్మ అనే మహిళ కుమారుడు కృష్ణ కుమార్ తో కలసి నివాసం ఉంటుంది. కృష్ణ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. అయితే ఆయన తల్లి రత్నమ్మకు దేవాలయాలు తిరగాలనే కోరిక ఉండేది. అయితే సంసార జీవితంలో పడి.. ఆ కల..కలగానే మిగిలిపోయింది. అయితే తన మాతృమూర్తి కోర్కెను తెలుసుకున్న కృష్ణకుమార్.. ఎలాగైనా నిరవేర్చాలనుకున్నాడు. తన తల్లి రత్నమ కోర్కెను తీర్చడానికి ‘మాతృసేవా సంకల్పయాత్ర’ చేపట్టారు. దేశంలోని పుణ్యక్షేత్రాలు, మఠాలు, పీఠాలు, ప్రసిద్ధ దేవాలయాలు చూపించడానికి సిద్ధమయ్యాడు.
అందులో భాగంగా తన సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యాత్రను ప్రారంభించాడు. తన తండ్రి వాహనమైన బజాజ్ చేతక్ లో 2018 జనవరి 16 మైసూరులో యాత్రను మొదలు పెట్టారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించాలని దృఢ నిశ్చయంతో వీరి యాత్ర సాగుతుంది. అయితే 2020లో కరోనా కారణంగా కొన్నాళ్ల పాటు విరామం ఇచ్చినా ఇటీవలే మల్లీ యాత్రను ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగామ, ఒడిశా, బీహర్, మణిపూర్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లు, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల్లోని ఆలయాలను దర్శించారు.
అలానే ఆయా ప్రాంతాల్లోని నదుల్లో స్నానం ఆచరించారు. ఇప్పటి వరకు మొత్తం 64, 658 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం అనంతపురం నగర శివారులోని శ్రీ చిన్మయ జగదీశ్వరాలయ, శంకరమఠం, ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం మంత్రాలయానికి వెళ్లనున్నట్లు కృష్ణకుమార్ తెలిపారు. తల్లిదండ్రులతో గడిపే తీరిక లేదనే బిడ్డలు ఉన్న ఈ కాలంలో అభినవ శ్రవణుడిలాగా ఈ కృష్ణకుమార్ తల్లి సేవలో తరించిపోతున్నారు. మరి.. కృష్ణకుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.