నేటి టెక్నాలజీ కాలానికి మనిషి ఎంతగా అలవాటు పడ్డాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉదయం లేచి మొదలు పడుకునే వరకు ఎదో రకంగా టెక్నాలజీని వాడుకుంటున్నాడు. ఇక ప్రతి మనిషికి స్మార్ట్ ఫోన్ అనేది సర్వ సాధారణం అయ్యింది. సాధారణంగా మన చుట్టూ ఎవరైనా ఉంటూ.. కొన్ని రోజుల పాటు ఎవరూ కనిపించకుంటే పిచ్చెక్కి పోతుంది. కానీ ఓ మనిషి దాదాపు పదిహేడేళ్లు ఎలాంటి సాధనం తన వద్ద లేకున్నా.. ప్రశాంతంగా అడవిలో ఒంటకిగా జీవిస్తున్నాడు.
దక్షిణ కన్నడ జిల్లాలోని అద్దేల్ ఇంకా నెక్కరే గ్రామాల మధ్య దట్టమైన అడవిలో చంద్రశేఖర్ (56) నివసిస్తున్నాడు. తలపై భారీగా పెరిగిన జుట్టు, రెండు జతల బట్టలు, ఒక జత రబ్బరు చెప్పులతోనే, చంద్రశేఖర్ జీవిస్తున్నాడు. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఇతని వద్ద ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి. ఆ గుడిసెలో ఒకప్పటి ప్రీమియం పద్మినీ కారు ఉంటుంది. వాస్తవానికి చంద్ర శేఖర్ గత జీవితం చాలా అందంగా ఉండేది. 17 ఏళ్ల క్రితం ఆయనకు నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల భూమి ఉండేది. 2003లో సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే, కొన్ని కారణాల వలన ఆయన తన బాకీ తీర్చలేకపోయాడు. దీంతో అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు.
తన జీవితం పై విరక్తి పుట్టిన చంద్ర శేఖర్ తన కిష్టమైన ‘ప్రీమియర్ పద్మిని’ కారు తీసుకుని సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత సోదరితో విబేధాలు వచ్చాయి. సొంత గ్రామానికి వెళ్లలే.. ఆత్మగౌరవం అడ్డొచ్చి, తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో అద్దెల్ – నెక్కారే అడవిలోకి వెళ్లిపోయాడు. జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి.. సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరకులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు చంద్ర శేఖర్ కి ఆధార్ కార్డు లేదు. ఆ మద్య చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం.. స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇల్లు కట్టించి ఇచ్చినా.. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తన భూమి తనకు వచ్చే వరకు తన పంతం వీడనని.. ఎన్ని కష్టాలైన భరిస్తానని అంటున్నాడు చంద్ర శేఖర్. అడవిలో ఉంటున్నా.. ఒక్క చెట్టు కూడా తాను నరకలేదని అంటున్నాడు. తనకు అడవి చాలని, అక్కడున్న జంతువులు తనను ఏమీ చేయవని అన్నారు. అటవీశాఖ అధికారులు కూడా చంద్రశేఖర్ వలన అడవికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.