నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానంటూ ఆనాడు తన కలాన్ని, గళాన్ని కదిపారు విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్. ఆనాటి సామాజిక పరిస్థితిలకి అయన మాటలే ఓ ప్రేరణ. కానీ.., ఇప్పటి సమాజం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఇప్పుడు మంచి మాటలతో పాటు.., సాయం చేసే చేతులు కావాలి. ఈ స్థితిలో ప్రజలను కాపాడుకోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేశారు మన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరుపున రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధ ప్రాతిపదికన ఇప్పటి వరకు 26 ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పారు ఆయన. మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు అయ్యింది అక్షరాల రూ.30 కోట్ల. ఇదేదో ఇంతటితో ఆగిపోయే సేవా కార్యక్రమం కాదు. ఆ ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణ అంత సులభం కాదు. ఏ మాత్రం తేడా జరిగినా వందల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎంతో బాధ్యతాయుతమైన ఆ ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్వహణని జిల్లాల వారీగా తన ఫ్యాన్స్ కి అప్ప చెప్పారు మెగాస్టార్. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎక్కడి వారైనా, ఏ కులం వారైనా, ఏ పార్టీ వారైనా చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్స్ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలో వారికి ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చేసిన మెగాస్టార్ మానవత్వాన్ని ఎంత పొగిడినా, ఎంత కీర్తించినా తక్కువే.
ఈ బృహుత్కర కార్యక్రమానికి అవసరమైన ప్రతి రూపాయిని మన బిగ్ బాస్ తన కష్టార్జితం నుండే ఖర్చు చేయడం, చేస్తుండటం విశేషం. ఇంతేనా.., తనకి అన్నం పెట్టిన సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు అండగా నిలబడిపోయాడు ఈ ఆపద్బాంధవుడు. ఇప్పటికీ కొన్నివేల సినీ కార్మికుల కుటుంబాలకి ఆయన నిత్యావసర సరుకులను అందిస్తూనే ఉన్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి కోట్ల రూపాయలు ఫండ్ అందించారు. పరిశ్రమలో ఎవరు కష్టాల్లో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకి వస్తున్నారు. ఇందుకే ఇప్పుడు తెలుగు ప్రజలకి చిరంజీవి అంటే అపాన్న హస్తం అందించే ఓ అన్నయ్య. ఆక్సిజన్ అనే సంజీవని అందిస్తున్న ఓ హనుమంతుడు. కళాకారుల కడుపు నింపుతున్న ఓ కళాతపశ్వి. తెలుగు సినీ కళామతల్లి కన్నీరు తుడుస్తున్నపెద్ద కొడుకు. సేవా కార్యక్రమాల్లో అభిమానులను భాగం చేసిన ఓ మార్గ దర్శకుడు. మొత్తంగా అందరివాడు. అందరిని ఆదుకుంటున్నవాడు.
నిజానికి ఇండస్ట్రీలో చిరంజీవి అడుగులు ఒంటరిగానే మొదలయ్యాయి. కేవలం తన భుజస్కంధాలతోనే అయన తన పునాదిరాళ్ళని నిర్మించుకున్నారు. తరువాత కాలంలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయ్యారు. కానీ.., ఆ మధ్య కాలంలో మెగాస్టార్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిద్దుర లేని రాత్రులు, పస్తులున్న రోజులు, ఎదుర్కొన్న అవమానాలు, వదులుకున్న ఆనందాలు, నేర్చుకున్న పాఠాలు.. ఇలా ఆయన జీవితంలో ఎన్నో భాగం అయ్యాయి. కానీ.., మన చంటబ్బాయ్ మొహంపై చిరునవ్వు తప్ప ఇవేమి కనపడనిచ్చే వాడు కాదు. తన బాధలను బ్రేక్ డ్యాన్స్ లతో కవర్ చేశాడు, డైలాగ్స్ తో దిగమింగాడు. అలా తన స్వయంకృషితో ఓ సాధారణ శివ శంకర వరప్రసాద్ నుండి సుప్రీమ్ స్టార్ అయ్యాడు. ఆ తరువాత మెగాస్టార్ అయ్యాడు. సినీ సామ్రాజ్యంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. మాములుగా ఎవరైనా ఇక్కడితో ఆగిపోయేవారు. సాధించిన విజయాలను చూసుకుంటూ సేద తీరేవారు. కానీ.., చిరంజీవికి ఆ పేరు, కోట్ల ఆస్తి సంతృప్తిని ఇవ్వలేదు. తనని ఇంతటి వాడిని చేసిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని నిరంతరం పరితపించేవారు. ఆ ఆలోచనలను మదిస్తే పుట్టిందే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్. గడిచిన 25 సంవత్సరాల కాలంలో ఈ ట్రస్ట్స్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని వేల మంది ప్రాణాలు నిబడ్డాయో, ఎందరి జీవితాల్లో వెలుగులు నిండాయో లెక్కగడితే మానవత్వంలో మెగాస్టార్ ని మరో మథర్ థేరిస్సా అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి ఉండదు.
తనకంటూ ఏమి లేకపోయినా చిరంజీవి ప్రజలకి సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఒక సంఘటన ఈనాటికీ నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. అది 1988-89 మధ్య కాలం. కాలం కలసి రాక, పంట చేతికి అందక, గుంటూరులో 18 మంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో.., చిరంజీవి వెంటనే స్పందించారు. రాష్ట్ర రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తూ.., ఆ రోజుల్లోనే ఒక్కో కుటుంబాలకి లక్ష రూపాయలు సహాయంగా అందించిన గొప్ప మానవతావాది మన మెగాస్టార్. 30 సంవత్సరాల క్రితం 18 లక్షలు సహాయం అంటే మాటలా? ఈరోజు లెక్కల ప్రకారం ఆ డబ్బుని లెక్క కడితే ఎంత అవుద్దో ఊహించగలమా? కానీ.., ఎందుకో మన మీడియాకి చిరంజీవి విషయంలో ఈ నిజాలను చెప్పే దైర్యం ఉండదు. మొగల్తూరులో ఇంటిని లైబ్రరరీకి ఇవ్వలేదన్న తప్పుడు వార్తని మాత్రం దశాబ్దాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు మీడియా చేసిన మూకుమ్మడి దాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.., ఎన్నడూ చిరు వారిపై నోరు జారింది లేదు. అయితే.., ఈనాడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.. కులాలకి, మతాలకి, ప్రాంతాలకీ అతీతంగా చిరంజీవి సాగిస్తున్న ఈ మహోత్తర సేవా కార్యక్రమాన్ని కూడా కీర్తించలేకపోతే అక్షరం సిగ్గుపడటం మాత్రం ఖాయం. నిరాశా, నిస్పృహలను దాటి, సకల సృష్టిని ప్రేమాభావంతో చూస్తూ.., శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశాన్ని చాటుతూ ముందుకి పోవాలన్నది విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి సారాంశం. ఈనాడు అందరిచేత జై చిరంజీవి అనిపించుకుంటూ మన మెగాస్టార్ విశ్వకవి పలుకులను నిజం చేసి చూపిస్తున్నాడు. ఇందుకే.. తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. జై చిరంజీవ. చిరంజీవి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.