సమాజానికి మంచి చేస్తే ఎవరైనా జేజేలు కొడతారు. రియల్ హీరో అని కీర్తిస్తారు. కానీ.., ప్రభుత్వాలు అలా కాదు. చేసిన మంచిని కాకుండా, దాని వెనుక కారణాలను వెతుకుతాయి. ఒక వ్యవస్థ నడిపించాల్సిన పనిని.. ఒకే ఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్ తో నడిపించేస్తుంటే ఇక ప్రభుత్వాలు చూస్తూ ఉరుకుంటాయా? ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తాయి. అవసరం అయితే కోర్టులు సైతం రంగంలోకి దిగుతాయి. రియల్ హీరో సోనూసూద్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అవసరమైన వారికి సోనూసూద్ ట్రస్ట్ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ అందించి ఆదుకుంది. చాలా మంది సెలబ్రెటీలకి సైతం సోనూ ఆ సమయంలో రెమ్ డెసివిర్ ని అందించాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.., ఇప్పుడు ఇదే విషయంలో సోనూసూద్ పై కేసు నమోదు అయ్యింది. కొరోనావైరస్ నిరోధక మందులు సరఫరా కొరత ఉన్నప్పుడు…, కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉండగా, సోనూసూద్ మాత్రం ప్రజలకు ఎలా రెమ్ డెసివిర్ ని సేకరించి పంపిణీ చేయగలిగారు? అనే దానిపై దర్యాప్తు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.., ఈ నెల 25న సోనూసూద్ కోర్టుకి హాజరుకావాల్సిన అవసరం ఏర్పడింది.
సోనూసూద్ ట్రస్ట్ పంపిణీ చేసిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ నాణ్యతపై కూడా హైకోర్టు అనుమానాలను వ్యక్తం చేసింది. ఔషధాల సేకరణ, సరఫరాలో సోనూసూద్ ఎవరి సాయం తీసుకున్నారు? అతడి వెనక స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషాన్ సిద్దిక్ పోషించిన పాత్ర ఏమిటి? వంటి అన్ని అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విచారణ చేయనుంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా.., రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ సేకరించి, సరఫరా చేయడం క్రిమినల్ చర్య క్రిందకే వస్తుందని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని హైకోర్టుకు చెప్పడంతో జస్టిస్ ఎస్పీ దేశ్ ముఖ్… జిఎస్ కులకర్ణి ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. రాజకీయ నాయకులే సోనూసూద్ పై కుట్ర చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.