క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గురువారం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్ఠ విలువకు 68,990 డాలర్ల(రూ.51 లక్షల)మార్క్ ను టచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగతుండడంతో హెడ్జింగ్ కోసం పెట్టుబడిదారులు ఎక్కువగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఎథరమ్, కార్డానో, సోలనా వంటి క్రిప్టో కరెన్సీల విలువ కూడా పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం కారణంగా చాలామంది బిట్ కాయిన్ వైపు చూస్తున్నారు. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ తగ్గుతుంది. కానీ బిట్ కాయిన్ విలువ మాత్రం తగ్గదు. అందుకే స్టాక్స్లో పెట్టుబడులు పెట్టే వారు, నష్టపోకుండా ఉండటానికి క్రిప్టో కరెన్సీల్లో కూడా పెట్టుబడులు పెడతారు. దీన్నే హెడ్జింగ్ అని అంటారు. కరెన్సీ సరఫరాను పెంచే, తగ్గించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. కానీ బిట్ కాయిన్ సప్లయ్ మాత్రం పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటుంది.
కాబట్టి ఈ క్రిప్టో విలువ పెరుగుతూ ఉంటుందని అంచనా. ఈ ఏడాదిలో బిట్ కాయిన్ విలువ పెరగడం ఆగస్టులో ప్రారంభమైందని, అప్పటి నుంచి పెరుగుతూనే ఉందని సీఎఫ్ బెంచ్ మార్క్స్ సీఈఓ చూంగ్ అన్నారు. గరిష్ఠ విలువ 68,990 డాలర్లలకు చేరుకున్న బిట్ కాయిన్ విలువ గురువారం సాయంత్రానికి 2.9 % నష్టంతో 64,946 డాలర్ల వద్ద ఆగింది. బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఔన్స్ గోల్డ్ ధర (స్పాట్) 1.8 శాతం పడింది. అదే బిట్కాయిన్ రేటు 130 శాతం పెరిగింది.