తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం వరుణ్ సింగ్ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వరుణ్ సింగ్ మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఐఏఎప్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ భరతమాత సేవలో అసువులు బాసారని, దేశ ప్రజలు వారిని, వారి సేవలను ఎప్పటికీ మరువరన్నారు. వరుణ్ సేవలు చిరస్మరణీయమన్న గవర్నర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన వారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడారు. వరుణ్ సింగ్ కోలుకుంటారని అందరూ భావిస్తున్న తరుణంలో మృతి చెందటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.