హైదరాబాద్- తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు వందఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పట్లో కలెక్టర్గా పని చేసిన ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
మరో వైపు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.