హైదరాబాద్- తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమని ఈటల వ్యాఖ్యానించారు. షామీర్ పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందని ఈ సందర్బంగా ఈటల అన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేశానని గుర్తు చేసిన ఆయన.. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానని చెప్పారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానని.. పార్టీకి నష్టం చేకూర్చే పని ఎప్పుడూ చేయలేదని అన్నారు.
గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆవేధన వ్యక్తం చేశారు. ఇక ఓ పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారని.. వేల కోట్లు సంపాధించానని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. జమున హ్యాచరీస్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న ఈటల.. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారని చెప్పారు. కనీసం తనపై వచ్చిన ఆరోపణలపై తన వివరణ కూడా తీసుకోలేదని.. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయని అన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కాదన్న ఆయన.. నయీం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా అని వ్యాఖ్యానించారు.