తెలుగు ఇండస్ట్రీలో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే వస్తోంది.ఈ మొత్తం కాలంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో ఇపుడు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ లభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఇంత కాలం సెలబ్రెటీలను దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారించినట్టు? 9 నెలల క్రితమే ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 12 మంది సెలబ్రెటీలకి క్లీన్ చిట్ లభిస్తే.. మరి ఇప్పుడు ఈడీ వీరిని ఎందుకు విచారించినట్టు? అప్పటి ఛార్జిషీట్ ని ఎందుకు బయటకి వెల్లడించలేదు? శాంపిల్స్ ఇచ్చిన పూరీ జగన్నాధ్, తరుణ్ డ్రగ్స్ వాడలేదని రిపోర్ట్స్ వచ్చాక కూడా వారిని ఈడీ ఎందుకు విచారణకి పిలిచినట్టు? అసలు నిజంగానే 12 మంది సెలబ్రెటీలకి క్లీన్ చిట్ లభించిందా? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
ఈ డ్రగ్స్ దందాలో మొదటి నుండి కీలక సూత్రధారి, పాత్రధారి అన్నీ కూడా కెల్విన్ మాత్రమే. ఇతను దొరకడంతోనే టాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు బయటకి వచ్చాయి. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. కెల్విన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా.. సినిమా తారలు, ఈవెంట్ మేనేజర్స్ ఫోన్ నంబర్స్ ని సిట్ కలెక్ట్ చేసింది. ఫోన్ నంబర్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా 12 మంది సెలబ్రిటీలతో పాటు మొత్తం 62 మందికి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులిచ్చింది. వారంతా విచారణకి హాజరయ్యారు కూడా. ఇందుకు సంబంధించిన అన్నీ రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించి.. కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ని గతేడాది డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కోర్టులో ఫైల్ చేసింది.
నిజానికి అక్కడితో ఈ కేసు ముగిసినట్టే. కానీ.., ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో రూ.100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బలంగా నమ్మింది. దీంతో డ్రగ్స్ కేసులో ఉన్న ఆర్ధిక కోణాలను లాగడం మొదలు పెట్టింది. దీంతో.. ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక్కడ ఈడీ దర్యాప్తు కొనసాగుతు ఉండటంతో, రంగారెడ్డి జిల్లా కోర్టులో సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ కూడా బయట పెట్టడానికి వీలు పడలేదు.
ఇక సెలబ్రెటీలపై ఈడీ విచారణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించడం మొదలు పెట్టింది. నిదానంగా దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారాన్ని కోరగా.., అప్పటి ఛార్జ్ షీట్ లోని అంశాలు బయటపడ్డాయి. అందులో సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్ డ్రగ్స్ దందాలో పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నవదీప్, తనీశ్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్, రవితేజ, ఆయన డ్రైవరు, ఎఫ్ క్లబ్ మేనేజర్ కు సంబంధాలేం లేవని తేల్చి చెప్పింది. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇది ఇప్పటి వరకు జరిగింది.
ఇప్పుడు ఛార్జ్ షీట్ లో క్లీన్ చిట్ అని ఉన్నా, ఈడీ విచారణ పూర్తయ్యే వరకు ఈ కేసు ముగిసింది అని చెప్పలేము. సో.. ఇంకా మన సెలబ్రిటీలందరికీ క్లీన్ చిట్ లభించినట్టు కాదు. ఒకవేళ ఈడీ అధికారులు కూడా కెల్విన్ తో మన సెలబ్రెటీలకి ఎలాంటి సంబంధం లేదు, వీరి మధ్య ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదని తేలిస్తే.. అప్పుడు ఈ కేసు నుండి సెలబ్రెటీలు అంతా పూర్తిగా బయట పడినట్టు. కానీ.., గత కొన్ని రోజులుగా ఈ విషయంలో రాజకీయ ఆరోపణలు మొదలవ్వడంతో అంతా ఈ కేసు ముగిసిపోయినట్టు వార్తలు పుట్టిస్తున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.