తెలుగు చిత్రసీమకు గతేడాది అంటే 2022 చాలా భారంగా గడిచింది. పలువురు ప్రముఖ నటీనటులు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో మరణించారు. దీంతో ఆయా సెలబ్రిటీల అభిమానులు చాలా బాధపడ్డారు. వీళ్లు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీల కుటుంబీకులు కూడా మరణించారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటనే జరిగింది. టాలీవుడ్ లో సింగర్ గా కెరీర్ ప్రారంభించిన రఘు కుంచె, ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. విలన్, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణరావు (90) మంగళవారం మరణించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సింగర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన రఘు కుంచె, పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా సాంగ్స్ పాడాడు. ఆ తర్వాత కాలంలో బంపర్ ఆఫర్, దొంగాట, పలాస తదితర సినిమాలకు మ్యూజిక్ కూడా అందించాడు. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా గాదరాడ ఇతడి స్వస్థలం. రఘు కుంచె భార్య, పిల్లలు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ ఊరిలోనే ఉంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రఘు కుంచె తండ్రి తాజాగా తుదిశ్వాస విడిచారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన ఆయన.. స్థానికంగా ఉండే సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హోమియో వైద్యుడిగానూ సేవలందించారు. అలాంటి వ్యక్తి చనిపోవడంతో పలువురు సెలబ్రిటీలు రఘు కుంచెకి ధైర్యం చెబుతున్నారు.