కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంటీ అనే పదం ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా మీద హాట్ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్.. ఆ తర్వాత ఆమె మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్.. ఆ తర్వాత ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. ఆంటీ అనడం ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది.. అంటూ అనసూయ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ సారి సీనియర్ నటుడు రవీంద్ర.. యాంకర్ శ్యామలను ఉద్దేశించి స్టేజీ మీదనే ఆంటీ అంటూ సెటైర్లు వేశాడు.
ఇక సీనియర్ నటుడు రాజా రవీంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తొలి నాళ్లల్లో.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్గా చేశాడు. ప్రస్తుతం పలువురు యంగ్ హీరోలకు మేనేజర్గా పని చేస్తున్నాడు. ఇదే కాక.. కొన్ని చిన్న చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న ‘తగ్గేదే లే’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజా రవీంద్ర మాట్లాడుతూ యాంకర్ శ్యామలపై సెటైర్లు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాతలు ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు తలుచుకుంటే ‘బాహుబలి’ లాంటి పది సినిమాలు తీయగలరు కానీ మనకు అలాంటి సినిమాలు వద్దు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్నారు. అందుకే ఈ ‘తగ్గేదేలే’ తీశారు. కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. భద్ర ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాతలు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. ఈ సినిమాలో పని చేస్తున్న అందరికి ముందుగానే వ్యాక్సిన్లు వేయించడం అందరికీ ముందే పేమెంట్స్ ఇవ్వడం వంటివి చేశారు. మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకునేవారు’’ అని తెలిపాడు.
ఇలా నిర్మాతలందరికి ధన్యవాదాలు చెబుతూ.. ఆఖర్లో.. ముఖ్యంగా శ్యామలా ఆంటీకి కూడా థాంక్యూ అంటూ ఆమెపై కౌంటర్స్ వేశాడు. రాజా రవీంద్ర మాటలకు షాకైన శ్యామల ఆ వెంటనే తేరుకుని.. ‘నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే’ అంటూ రాజారవీంద్రపై రివర్స్ కౌంటర్ ఇచ్చింది శ్యామల.