తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో.. నటీనటులే.. తమ పాత్రలకు మాటలతో పాటు.. పాటలు కూడా పాడుకునేవారు. అలా.. అప్పటి అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరావు పలు సినిమాల్లో తానే పాటలు పాడుకున్న సందర్భాలున్నాయి. ఇక ఆ తర్వాతి తరంలో.. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పాటలు పాడే పద్ధతికి నాంది పలికారు. ‘మాస్టర్’ సినిమాలో.. ‘తమ్ముడూ.. తమ్ముడూ’ సాంగ్ తో పాటు.. ‘మృగరాజు’ చిత్రంలో ‘ఛాయ్ చటుక్కున తాగరా భాయ్’.. అంటూ మరో పాటను ఆలపించారు మెగాస్టార్. చిరంజీవి.. ‘ఛాయ్’ గురించి పాట పడితే.. కింగ్ నాగార్జున ‘సీతారామరాజు’ సినిమాలో సిగరెట్స్ పై పాట అందుకున్నాడు. ఈ సినిమాలో.. సిగరెట్ గొప్పదనం గురించి గొప్పగా పాడిన నాగ్.. ఆ తర్వాత తాను ప్రొడ్యూస్ చేసిన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో.. కొత్త కొత్త భాష అంటూ టీనేజ్ లవ్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఇక.. ‘గురు’ చిత్రంకోసం వెంకీ ఆలపించిన ‘జింగిడి’ సాంగ్ కూడా దుమ్మురేపింది. మందు గురించి సాగే ఈ గీతాన్ని తనదైన శైలిలో ఆలపించి చిందేశాడు విక్టరీ హీరో. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే.. సింగింగ్ లోనూ.. ప్రొఫెషనల్ సింగర్ గా దుమ్మురేపాడు. తారక్ తన ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాల్లో.. సింగింగ్ ట్యాలెంట్ ను బయటపెట్టాడు. ఈ సినిమాలలో హై ఎనర్జీతో సాగే గీతాలను ఆలపించి ఆకట్టుకున్నాడు యంగ్ టైగర్.
ఇక నటనతో పాటు.. చిత్ర పరిశ్రమల్లోని పలు శాఖల్లో ప్రవేశం పొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా.. సింగర్ అవతారమెత్తాడు. తాను డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమాలో.. ‘సారా తాగుట మాను..’ అంటూ సారాపై సాంగ్ పాడాడు. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘కాటమరాయుడా..’ అంటూ హై పిచ్ లో సాంగ్ ను ఆలపించి అదరగొట్టాడు పవర్ స్టార్. ఇక తాజాగా ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేక్ కోసం మరోసారి తన సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టనున్నాడట పవర్ స్టార్. మలయాళంలో హిట్టైన ‘అయ్యపనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో పవన్-రానా కలిసి నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక.. ఈ చిత్రంలో పవర్ స్టార్ తో ఓ ప్రత్యేకమైన గీతాన్ని పాడించబోతున్నాడట తమన్. జానపద శైలిలో సాగే ఆ పాట సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందట. మొత్తంమీద.. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేక్ లో పవర్ స్టార్ సాంగ్.. సినిమాకి ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.