పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు జరిపిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో వారాహి యాత్రకు కాస్త విరామం ప్రకటించారు పవన్.
వారాహి యాత్రతో విరామం లేకుండా గడుపుతున్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం (జూన్ 27)న అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సినీ పరిశ్రమ వర్గాల వారు, సన్నిహితులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేనానికి ఏం జరిగిందంటూ వాకబు చేస్తున్నారు. ఇటీవలే వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్ విరామం లేకుండా ఆ వెంటనే వారాహి యాత్ర చేపట్టారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా ప్రచారంలోకి దిగిన ఆయన ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనం మధ్యలోనే ఉంటూ జనం సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో తెలియజేస్తూ, తన తోటి కథానాయకుల గురించి మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ప్రేక్షకాభిమానుల మనసులు దోచుకుంటున్నారు. అలాగే రాజకీయా వ్యవస్థ గురించి, ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తూ జనాలను చైతన్య పరుస్తున్నారు జనసేనాని.
అయితే అనారోగ్యానికి గురైన పవన్ మంగళవారం మధ్యాహ్నం భీమవరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో పార్టీ పటిష్టతపై సమాలోచనలు చేశారు. కాగా పవన్ ఇప్పుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు జరిపిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో వారాహి యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్. ప్రస్తుతం భీమవరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగించడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం కారణంగా పవన్ ఆరోగ్యం దెబ్బతిందని సమాచారం. తిరిగి ఈనెల 30న స్థానికి అంబేద్కర్ సెంటర్లో జరుగబోయే సభతో వారాహి యాత్ర ప్రారంభమవతుందని పార్టీ వర్గాల వారు తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. తన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్తో కలిసి ‘బ్రో’ మూవీ చేసిన పవన్ కేవలం 22 రోజుల్లోనే తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశారు. ఇందుకు పారితోషికంగా రోజుకి రూ. 2 కోట్ల చొప్పున తీసుకున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ నిర్మిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో టీజర్ వదలనున్నారు. జూలై 28న చిత్రం విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. హరీష్ శంకర్తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే స్టార్ట్ అయింది. ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ‘ఓజీ’ మూవీ అప్పుడే 50 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నారు. పవన్ తండ్రి పాత్రలో బిగ్బి అమితాబ్ బచ్చన్ నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.