పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీలో కామెడీ కింగ్, పవన్కి అత్యంత ఆప్తుడు ఆలీ ఓ కీలకపాత్రలో నటించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. త్వరలో స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.
సినిమా పరిశ్రమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటుంటారు. దీనికి ఉదాహరణగా ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి కూడా. ఒకప్పుడు కారాలు మిరియాలు నూరిన వారు తర్వాత కలిసిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మధ్య భేదాభిప్రాయాలు అనేవి వస్తుంటాయి. కొద్ది రోజుల తర్వత అయినా కలిసి పని చేయాల్సి వస్తుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మూవీలో వివిధ కారణాల వల్ల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ని తప్పించడం, తర్వాత ఇద్దరు కలిసి ‘జల్సా’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించడం జరిగింది. ఇప్పుడు మరోసారి పవన్ సినిమాల్లో గతకొద్ది కాలంగా కనిపించకుండా పోయిన ప్రముఖ కమెడియన్ తిరిగి నటించనున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆయనెవరో కాదు.. కామెడీ కింగ్, పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు ఆలీ.
సినిమా రంగంలో పవన్కున్న అతి తక్కువ మంది సన్నిహితుల్లో ఆలీ ఒకరు. తను పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుందంటూ గతంలో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పవర్ స్టార్ సినిమాల్లోనూ ఆలీ నటించడం అనేది సెంటిమెంట్గా మారింది. వీరి కాంబోకి అదిరిపోయే క్రేజ్ ఉంది. కట్ చేస్తే, బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా పాలిటిక్స్ పుణ్యమా అని దూరమైపోయారు. పవన్ పార్టీలో కాకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు ఆలీ. ఆ పార్టీలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవి కూడా పొందారు. అయితే గత ఎన్నికల సమయంలో స్నేహితుడు పవన్ పార్టీలో మీరెందుకు చేరలేదని ఆలీని అడగ్గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ పవన్ ఫ్యాన్స్తో పాటు జనసైనికులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తర్వాత తన కుమార్తె వివాహానికి పవన్ని ఆహ్వానించారు ఆలీ. కొన్ని కారణాల వల్ల ఆయన వివాహానికి రాలేకపోయారు. ఇదిలా ఉంటే కొద్దికాలంగా పవన్ సినిమాల్లో ఆలీ కనిపించడం లేదు. దీంతో రాజకీయాల పరంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు అనుకున్నారు. అయితే ఇప్పుడీ దోస్తులిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
పవన్ – సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీలో ఆలీ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 50 శాతం షూట్ కంప్లీట్ అయిందని, త్వరలో స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో ఆలీ జాయిన్ అవుతారని, ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఇటీవల తన తోటి హీరోల గురించి మాట్లాడి ఆకట్టుకున్న పవన్, తన ప్రసంగంలో ఆలీ గురించి ప్రస్తావస్తారా? ఈ న్యూస్ గురించి ‘ఓజీ’ మేకర్స్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్, పవన్ తండ్రి పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.