కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతకాల్సిన పరిస్థితిలు తలెత్తాయి. సరైన వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ అందక వేల మంది ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. సామాన్యుల విషయంలోనే కాదు, సెలబ్రెటీలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. ఇందుకు సినీ ఇండస్ట్రీ అతీతం ఏమి కాదు. తాజాగా పరిశ్రమలో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా మీకు గుర్తుంది కదా? ఆమె కజిన్స్ ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మీరా చోప్రా బాగా ఎమోషనల్ అవుతూ తన కజిన్స్ మృతి విషయాన్ని షేర్ చేసింది. ఇప్పుడు మనం చాలా దారుణమైన స్థితిలో ఉన్నాము. కరోనా మొదటి వేవ్ వెళ్లిపోయింది. ఇక అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. నేను తక్కువ సమయంలో నా ఇద్దరు కజిన్స్ ను కోల్పోయాను. ఇద్దరు కూడా 40 ఏళ్ల వయసు లోపు వారే. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే మా కజిన్స్ సరైన సమయంలో చికిత్స అందక మృతి చెందారు. ఆసుపత్రిలో బెడ్ లేక పోవడం వల్ల ఒకరు, ఆక్సీజన్ అందక మరొకరు మృతి చెందారు. నేను వాళ్లను రక్షించుకోలేక పోయాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఇద్దరి మృతి తర్వాత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కాస్త ఆందోళనగా కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు ముందు ఎప్పుడు ఎదురు కాలేదు. లక్షలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోతే ఎలా అంటూ మీరా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు చిత్రాల్లో నటించిన మీరా చోప్రా.. తరువాత కాలంలో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.