ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్లకు కూడా ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. ఒకవేళ ఏదైనా నేరం చేసి తప్పించుకోవాలని చూస్తే.. ఇప్పుడు తప్పించుకోవచ్చేమో కానీ ఎప్పటికైనా సరే దొరికిపోతారు. ఇలాంటిదే ఇప్పుడు ఓ సీనియర్ నటి విషయంలో జరిగింది. సోదరుడి భార్యని వేధించినా కేసులో దాదాపు పదేళ్ల తర్వాత తుదితీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే సదరు నటికి జైలుశిక్ష ఖరారైంది. త్వరలో ఆమె జైలుకు వెళ్లనుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నటి అభినయ, 80ల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో ‘క్రష్’ సినిమలో నటించిన ఈమె.. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక అభినయ వ్యక్తిగత జీవితంలో ఓ వివాదం ఎప్పటినుంచో ఉంది. అభినయ సోదరుడు శ్రీనివాస్ కు లక్ష్మీదేవితో 1998లో పెళ్లయింది. కట్నంగా రూ.80 వేల డబ్బు, 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే అభినయ కుటుంబం తనని మరో లక్ష రూపాయల కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నారంటూ.. 2002లో లక్ష్మీదేవి బెంగళూరు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు అభినయతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
అయితే చాలా వాయిదాల తర్వాత 2012లో మేజిస్ట్రేట్ కోర్టు.. ఐదుగురు నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. కానీ జిల్లా కోర్టు దీనిపై స్టే విధించింది. ఈ క్రమంలోనే లక్ష్మీ దేవి.. జిల్లా కోర్ట్ తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు వేశారు. ఇక కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. కొన్నాళ్ల ముందు అభినయ సోదరుడు శ్రీనివాస్, తండ్రి రామకృష్ణ చనిపోయారు. తాజాగా ఇప్పుడు హైకోర్టు తుదితీర్పు వెలువరించింది. కట్నం వేధింపుల కేసులో నటి అభినయతో పాటు ఆమె తల్లి జయమ్మ, సోదరుడు చెలువకు చెరో రెండేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో త్వరలో ఈ ముగ్గురు కూడా జైలుకు వెళ్లనున్నారు.