సినీ రంగంలో మేటి పురస్కారంగా భావించే ఆస్కార్ – 2022 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రాల విభాగంలో ఇండియా నుండి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించి నిర్మించిన ‘జై భీమ్’ కాగా రెండోది మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పీరియాడిక్ మూవీ ‘మరక్కార్’ కావడం విశేషం.
టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ మూవీ.. 2021 నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆస్కార్స్ – 2022 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి అర్హత సాధించింది. జై భీమ్తో పాటు మరక్కర్ కూడా షార్ట్ లిస్ట్ చేయబడింది. తుది నామినేషన్ జాబితా ఫిబ్రవరి 8న ప్రకటించబడుతుందని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా 94వ అకాడమీ అవార్డ్స్(ఉత్తమ చిత్రం విభాగం)కి షార్ట్ లిస్ట్ చేసిన 276 చిత్రాలలో.. జై భీమ్(తమిళం), మరక్కార్(మలయాళం) రెండే ఇండియా నుండి ఎంపిక కావడం గొప్ప విషయం. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ జనవరి 27న ప్రారంభమవుతుంది. ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఫిబ్రవరి 8న రాబోతుంది. ఇక ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 27న(ఆదివారం) US లోని హాలీవుడ్ లో జరగనుంది.
ఇదిలా ఉండగా.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ‘మరక్కర్’ చిత్రం.. మలయాళ సినీ చరిత్రలో హై బడ్జెట్ సినిమాల్లో ఒకటి. ఇది మలబార్ సముద్రరాజు అయిన కుంజలి మరక్కర్ IV, పోర్చుగీసు వారిపై పోరాడిన యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కింది. గతేడాది మరక్కార్.. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకుంది. ఆస్కార్ ఉత్తమ చిత్రాల విభాగంలో ఇదివరకు సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ కూడా నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే. మరి జై భీమ్, మరక్కార్ ఆస్కార్ బరిలో నిలవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.