గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమకు చెందిన పలువురు మృత్యువాత పడుతున్నారు. వరుస విషాదాలతో అటు వారి కుటుంబాల్లోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రముఖుల మృతితో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించడమే కాక.. ఆస్కార్ అవార్డ్కు నామినెట్ అయిన ప్రముఖ నటుడు ఒకరు మృత్యువాత పడ్డారు. ఆయన గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు జేమ్స్ కాన్ (82). శుక్రవారం ఆయన కన్నుమూశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్న తన నివాసంలో జేమ్స్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. జేమ్స్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఆయన మరణానికి కారణమేంటనేది తెలియలేదు.
ఆయన మరణం పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం ప్రకటించారు. ‘‘బుధవారం (జూలై 6) సాయంత్రం జిమ్మీ కన్నుమూశారనే విషయాన్ని తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాం’’ అంటూ జేమ్స్ ఫ్యామిలీ ఆయన మరణవార్తను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ దు:ఖ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నట్లు పేర్కొంది. జేమ్స్ కాన్ మరణంపై ఆయన మేనేజర్ స్పందిస్తూ.. జేమ్స్ చాలా గొప్పవాడని పేర్కొన్నారు. అతను చాలా సరదా వ్యక్తి అని, అందరితో ప్రేమగా ఉండేవాడని చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్, మిజరీ, ఎల్ఫ్ తదితర చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేమ్స్.
జేమ్స్ కాన్ మార్చి 26, 1940లో అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు. కెరీర్ ఆరంభంలో థియేటర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1963లో Irma la Douce అనే చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి 2021 వరకు ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. గాడ్ ఫాదర్ సినిమాలో సోని కార్లియోన్గా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు. రోలర్ బాల్, థీఫ్, రోబ్ రీనర్స్, మిజరీ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నటనపరంగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న జేమ్స్ కాన్.. ఆస్కార్కు కూడా నామినేట్ అయ్యారు. జేమ్స్ కాన్ మరణంతో హాలీవుడ్లో విషాదం నెలకొంది.