తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఓ ధృవతారగా నిలిచిపోయారు. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కిందని అంటారు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులు సీనియర్ ఎన్టీఆర్. ఆయన వారసులుగా నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ వ్యవహారాలు అన్నీ హరికృష్ణ చూసుకునేవారు.. దాంతో ఇండస్గ్రీకి దూరం అయ్యారు.
అదే సమయంలో నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా వచ్చినప్పటికీ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్. ఓ వైపు యాడ్స్ లో నటిస్తూ.. మరోవైపు బుల్లితెర యాంకర్ గా తన ప్రతిభ నిరూపించుకుంటున్నారు. మొదటిసారిగా బిగ్ బాస్ సీజన్ 1 తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అప్పట్లో మా టివి కి మంచి క్రేజ్ పెరగడానికి కృషి చేశారు. తర్వాత సినిమా షూటింగ్స్ కారణంగా ఆ ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పారు. బిగ్ బాస్ 2 నేచురల్ స్టార్ నాని హూస్ట్ చేయగా.. 3,4 సీజన్లు కింగ్ నాగార్జున కంటిన్యూ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్-5 కార్యక్రమం ఇటీవలే జెమినీ టీవీలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం మొదలు కాకుండా కేవలం ప్రోమోలతోనే ఎంతో క్యూరియాసిటీ పెంచారు ఎన్టీఆర్. అంచనాలకు తగ్గట్టుగానే ఈ షో దుమ్మురేపింది. ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ కార్యక్రమం ప్రసారమయ్యే స్లాట్ లో జెమినీ టీవీ అత్యధిక రేటింగ్ సాధించింది. జెమిని టీవీ రేటింగ్ 290 జీఆర్పీ నుంచి 400 జీఆర్పీకి వెళ్లింది. మొదటి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా… నాలుగో సీజన్ కు చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్కు 9.70, రెండో సీజన్లో 8.20, మూడో సీజన్లో 6.72, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది.