ప్రముఖ తెలుగు రచయిత ఇంట విషాదం నెలకొంది. అనేక సినిమాలకు మాటలు అందించిన రైటర్ మరుధూరి రాజా పెద్ద కుమారుడు కాలం చెందారు.
దేవుడు పరీక్షలు పెడుతుంటాడు. పుట్టిస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తలరాత ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. దేవుడు పెట్టిన పరీక్షలో ఓ టాలీవుడ్ రైటర్ కుమారుడు ఫెయిలయ్యారు. దేవుడు దారుణమైన పరీక్ష పెట్టాడంటూ కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి బతికుండగా కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఎంత నరకంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఓ టాలీవుడ్ రచయిత విషయంలో ఇదే జరిగింది. ప్రముఖ టాలీవుడ్ రచయిత మరుధూరి రాజా పెద్ద కుమారుడు మరణించారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘దేవుడు మళ్ళీ ఓ దారుణమైన పరీక్ష పెట్టేశాడు. మొన్న 26వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు జాండీస్, డెంగ్యూ 20 రోజులు ఇబ్బంది పెట్టడంతో దేవుడి పిలుపుతో పెద్ద వాడు దూరంగా వెళ్ళిపోయాడు.
ఆరోజు ఏమీ అర్థం కాని, ఏదో తెలియని అయోమయ స్థితిలో వెంటనే తెలియపరచలేకపోయాను. నాలోకి నేను వచ్చే టైమ్ తీసుకుని కలుస్తాను. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మరుధూరి రాజా తెలుగు సినీ పరిశ్రమలో మాటల రచయితగా బాగా ఫేమస్. 200కి పైగా సినిమాలకు రచయితగా పని చేశారు. ఈయన మొదటి సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన ఒంటరి పోరాటం. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కె. రాఘవేంద్రరావు వంటి దర్శకులతో ఎక్కువగా కలిసి ట్రావెల్ అయ్యారు. అతనొక్కడే, నువ్వు వస్తావని, సీమశాస్త్రి, రణం, బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జీ, సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం ఇలా అనేక సినిమాలకు మాటలు అందించారు.
కామెడీ, ఎమోషనల్ ఇలా సందర్భం ఏదైనా తనదైన మార్కు చూపించడంతో ఆయనకి ఆయనే సాటి. పదునైన డైలాగులతో పౌరుషాన్ని, కామెడీ డైలాగులతో హాస్యాన్ని, సెంటిమెంట్ డైలాగులతో కన్నీరుని తెప్పించగలరు. నవరసాలతో మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న మరుధూరి రాజా ఆయన పెద్ద కొడుకు మరణంతో శోక సంద్రంలో మునిగిపోయారు. ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నానని ఆయన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. నెటిజన్స్ ఆయన కుమారుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం. ఓం శాంతి!