కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసి.. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన విశ్వనాథ్.. ఫిబ్రవరి 2, గురువారం రాత్రి కన్ను మూశారు. కళాతపస్వి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, వెంకయ్య నాయుడు, చిరంజీవి, వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇక విశ్వనాథ్ మృతికి సంతాపసూచకంగా ఒకరోజు షూటింగ్లు బంద్ చేశారు.
ఇక పలువురు నటులు విశ్వనాథ్తో తముకున్న అనుంబంధాన్ని తలుచుకుని.. భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో విశ్వనాథ్ కెరీర్లో చోటు చేసుకున్న అనేక సంఘటనలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో.. ఎన్టీఆర్తో విశ్వనాథ్ గొడవపడ్డారనే వార్త ఆసక్తికరంగా ఉంది. మరి వారిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది.. చివరకు అది ఎలా సద్దుమణిగిందో తెలియాలంటే ఇది చదవాలి.
సీనియర్ ఎన్టీఆర్, విశ్వనాథ్కు కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది. విశ్వనాథ్ గుంటూరు ఏసీ కాలేజీ, హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హిందూ కాలేజీలో ఎన్టీఆర్.. విశ్వనాథ్కు సీనియర్. అప్పటి నుంచి ఆయనతో విశ్వనాథ్కు పరిచయం ఉంది. చదువు పూర్తయ్యాక ఎన్టీఆర్ గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసేవారు. దానిలో భాగంగా.. ఎన్టీఆర్ ప్రతి రోజు విజయవాడ నుంచి రైల్లో గుంటూరు వచ్చేవారు. ఇక విశ్వనాథ్ కూడా కాలేజీకి వెళ్లడం కోసం అదే రైలు ఎక్కేవారు. అలా వారి రైలు పరిచయం ముందుకు సాగింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఎన్టీఆర్ మద్రాస్ వెళ్లి సినిమాల్లో చేరారు. హీరో అయ్యారు. ఆ తర్వాత విశ్వనాథ్ కూడా వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా చేరారు. దాంతో వారిద్దరూ తరచుగా వాహినీ స్టూడియోలో కలుస్తుండేవారు. ఇద్దరూ పాతపరిచయం కొనసాగించారు. ఎన్టీఆర్, విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం చిన్ననాటి స్నేహితులు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వీరి మధ్య ఓ గొడవ జరిగింది. దాంతో ఎన్టీఆర్, విశ్వనాథ్ కొన్ని ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు.
ఇంతకు గొడవకు కారణం ఏంటంటే.. చిన్ననాటి స్నేహితులు సినిమా షూటింగ్లో భాగంగా ఓ సీన్ తీస్తున్నారు. ఈ సీన్ కోసం ఎన్టీఆర్ కూలింగ్ గ్లాసెస్తో సెట్లోకి వచ్చాడు. అది చూసిన విశ్వనాథ్.. ఇది సెంటిమెంట్ సీన్ కదా.. నల్ల కళ్ల జోడు ఉంటే బాగుండదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం.. ఏం పర్వాలేదు.. బాగుంటుంది అని కళ్ల జోడు అలానే ఉంచుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుని పెరిగి పెద్దదయ్యింది. ఇదంతా గమనించిన నిర్మాత డీవీఎస్ రాజు విశ్వనాథ్కు నచ్చజెప్పారు. చివరకు ఎన్టీఆర్ కళ్ల జోడుతోనే షూటింగ్లో పాల్గొన్నారు.
ఈ సంఘటనతో ఎన్టీఆర్, విశ్వనాథ్ మీద ఆగ్రహించారు. అంతేకాక డబ్బుకు లోకం దాసోహం సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి విశ్వనాథ్ను తప్పించి.. ఆ ప్లేస్లో యోగానంద్ను తీసుకున్నారు ఎస్వీ ఫిల్మ్స్ అధినేతలు. ఇక ఈ సంఘటన జరిగిన దాదాపు 14 ఏళ్ల తర్వాత.. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హీరోగా.. విశ్వనాథ్ దర్శకత్వంలో జననీ జన్మభూమీ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. అలా 14 ఏళ్ల పాటు వీరిద్దరూ మాట్లాడుకోలేదు. చివరకు బాలకృష్ణ సినిమాతో వీరిద్దరూ మాట్లాడుకున్నారు.