ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. గత కొంత కాలంగా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ చిత్రాలు రిలీజ్ కన్నా ముందే ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం జరుగుతుంది. తాజాగా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ వివాదంలో చిక్కుకుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ సినిమాకు చిక్కుల్లో పడింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఫైనాన్షియర్ కంపెనీ ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో ‘83’ నిర్మాతలపై చీటింగ్ ఫిర్యాదును దాఖలు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రం నిర్మించే సమయంలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో వీరు నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని… తీరా చూస్తే తమను మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. చిత్ర నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు.