సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆమె తెలుగు చలనచిత్ర రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తోంది. రీల్ లైఫ్ లో ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొంది. ఇంతే సంఖ్యలో వివాదాల్లోనూ చిక్కుకుంది. సీనియర్ నటి కావడంతో ఎవరి గురించి అయినా.., ఉన్నది ఉన్నట్టు మాట్లేడేయడం ఈమెకి అలవాటు. ఈ కారణంగానే.., అన్నపూర్ణమ్మ చాలా మందికి విరోధిగా మారింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సీనియర్ ఆర్టిస్ట్.. రాజీవ్ కనకాల ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
అన్నపూర్ణమ్మ 22 ఏళ్ళ క్రితం దేవదాసు కనకాల వద్ద ఓ స్థలం కొనుగోలు చేశారు. అప్పుడు ఆమె చెన్నైలో ఉండేది. అయితే.., దేవదాసు కనకాల తనకి అమ్మిన ఆ స్థలాన్ని మళ్లీ వెంచర్ వేసి వేరే వాళ్లకి అమ్మేశారట. ఇప్పుడు ఈ విషయం మీదే అన్నపూర్ణమ్మ సంచలన కామెంట్స్ చేసింది.
“దేవదాస్ కనకాలతో చాలా ఏళ్లుగా స్థలం వివాదం నడుస్తూ ఉంది. ఆయన మాటలు నమ్మి ఆ స్థలానికి డబ్బు కట్టాను. ఆయన ఆ స్థలాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఈ గొడవ జరుగుతూ ఉండగానే దేవదాస్ కనకాల చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాజీవ్ కనకాలకి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ కావడం లేదు. నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు. మధ్యవర్తి చేత అడిగిస్తే నాకేమి సంబంధం లేదు, నా దగ్గర ఏమి లేవు అంటున్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తి ఈయనది అయినప్పుడు, ఆ స్థలం విషయంలో రాజీవ్ కి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఇక వాళ్ళ నుండి నాకు ఏమి రాదని అర్ధం అయిపోయింది. పోనివ్వండి.. వాళ్ళేమైనా పోయేటప్పుడు ఈ భూమిని పట్టుకుని పోతారా? నేనేమైన పట్టుకుని పోతానా, కాస్త ముందు నేను పోతా.. వెనుక వాళ్లు వస్తారంతే. మొత్తానికి అందరూ పోయేవాళ్లే. ఇది శాపం అనుకోండి.. తిట్టడం అనుకోండి. ఇంకేమైనా అనుకోండి” అంటూ తన ఆక్రోశాన్ని బయటపెట్టింది అన్నపూర్ణ. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో రాజీవ్ ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి.