దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ఎంతో మంది సెలబ్రెటీలు తమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వస్తు, డబ్బు రూపంలో విరాళాలు అందిస్తూ తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్ లాంటి వారు.. దేశవ్యాప్తంగా అనేక రకాలుగా సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటుండటగా… తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న సాయం కూడా చర్చనీయాంశంగా మారింది.
అమితాబ్ బచ్చన్ చేస్తున్న సాయాలకు కూడా బ్రేక్ అనేదే లేదనే చెప్పాలి. కరోనా పోరులో భాగంగా గతంలో సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చాడు బిగ్ బి. ఢిల్లీలోని కొవిడ్ కేర్ సెంటర్కు 2 కోట్లు సాయం చేసిన అమితాబ్.. జుహూలో 25-50 బెడ్ల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలామంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్లు అందజేసి ఉదారత చాటుకున్నారు. అలాగే ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు సమకూర్చారు అమితాబ్.
పేద రైతుల్ని సైతం ఆర్ధికంగా ఆదుకున్నాడు అమితాబ్ బచ్చన్ . చాలా మందికి చేయూతనిచ్చాడు. ఇక రెండో దశ కరోనా సమయంలో విదేశాల నుంచి వెంటిలేటర్స్ తెప్పించారు. రీసెంట్గా కూడా సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేసింది. ఇలా ఎంత పెద్ద సాయం చేస్తున్నా.. బయటకు చెప్పుకోకుండా అమితాబ్ కూడా రియల్ హీరో అని అనిపించుకుంటున్నాడు. కరోనా కష్ట కాలంలో ఇప్పటి వరకు అమితాబ్ చేసిన అన్ని సహాయాలను డబ్బు రూపంలో లెక్క కడితే సుమారు రూ.20కోట్ల దాటి ఉంటుందని అంచనా. ఏదేమైనా తనని ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం అమితాబ్ మంచి మనసుతో ఇలా ముందుకి రావడం అభినందినచతగ్గ విషయం.