చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు శరణ్ రాజ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు, నటుడు శరణ్ రాజ్ కన్నుమూశారు. బైకు యాక్సిడెంట్ కారణంగా శరణ్ 26 ఏళ్ల వయసులోనే తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో నటుడి కారణంగా శరణ్ రాజ్ ప్రమాదానికి గురై చనిపోవటం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శరణ్ రాజ్ చెన్నైలోని మధురవోయల్లోని ధనలక్ష్మి పేటలో నివాసం ఉంటున్నారు. ఆయన శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన బైకుపై కేకే నగర్లోని రోడ్డుపై వెళుతూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ కారు.. శరణ్ రాజ్ వెళుతున్న బైకును ఢీకొట్టింది. యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడ్డ శరణ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శరణ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్న పళనప్పన్ అనే వ్యక్తి కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
పళనప్పన్ మద్యం సేవించి కారు నడిపాడని, ఆ మత్తులోనే శరణ్ బైకును ఢీకొట్టాడని తేలింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకీ తీసుకున్నారు. కాగా, శరణ్ రాజ్ గత కొన్నేళ్లుగా వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్నారు. నటన మీద ఆసక్తితో పలు వెట్రిమారన్ సినిమాల్లో కూడా నటించారు. అసురన్, వడాచెన్నై వంటి క్రేజీ సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్గా కొనసాగుతున్నారు.