ఆడవారికి వివాహం అయ్యింది అంటే.. ఇక వారి జీవితానికి ముగింపు అనేటటువంటి పరిస్థితులు ఎదుర్కొనే మహిళలు.. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వివాహం అయ్యిందంటే.. ఇక ఆమె జీవితం ముగిసిపోయి.. భర్త, అత్తింటివారు, పిల్లల కోసం బతకడమే ఆమె లోకంగా మారుతుంది. తన గురించి తాను ఆలోచించుకోదు.. తన ఆరోగ్యం పట్టించుకోదు.. భర్త, బిడ్డలే లోకంగా బతుకుతారు. పెళ్లికి ముందు వరకు.. తమ గురించి తాము ఎంతో శ్రద్ధ తీసుకుని.. అందంగా తయారయ్యే మహిళలు కూడా.. వివాహం తర్వాత.. ఇక ఆ విషయాలను పట్టించుకోరు. పట్టించుకోరు అనుకోవడం కన్నా కూడా దానికి సమయం లభించదు అని చెప్పడం కరెక్ట్. కానీ వివాహమైన మహిళ.. తమ గురించి తాము కాస్త ప్రత్యేక శ్రద్ధ కనబిరిస్తే.. వారు కూడా జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది విజయవాడకు చెందిన ఓ మహిళ. ఆ వివరాలు..
మిసెస్ వరల్డ్ 2022 అంతర్జాతీయ అందాల పోటీల్లో భారతీయ మహిళ విజయం సాధించింది. అమెరికా, లాస్వేగాస్ వేదికగా జరిగిన మిసెస్ వరల్డ్ 2022 అందాల పోటీల్లో భారత్కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా నిలిచి.. కిరీటం దక్కించుకున్నారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ మిసెస్ వరల్డ్ కిరీటం ఇండియాకు దక్కింది. రెండు దశాబ్దాల తర్వాత.. ఈ కిరీటం గెలుచుకున్న భారతీయ మహిళగా కౌశల్ నిలిచారు. 2001లో భారత్కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత.. సర్గమ్ కౌశాల్ విజేతగా నిలిచారు. ఇక గతేడాది మిసెస్ వరల్డ్ విజేత అయిన షాయలిన్ ఫోర్డ్ (అమెరికా).. సర్గమ్కు ఈ కిరీటాన్ని అలంకరించారు. అలాగే, ఇదే పోటీల్లో మిసెస్ పాలినేషియా మొదటి రన్నరప్గా నిలవగా.. మిసెస్ కెనడా రెండో రన్నరప్గా నిలిచారు.
మొత్తం 63 దేశాలకు చెందిన మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మిసెస్ ఇండియాగా సర్గమ్ విజేతగా నిలిచినట్టు మిసెస్ ఇండియా పోటీ నిర్వాహకులు ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు వారు తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. కిరీటం గెలుచుకున్న అనంతరం సర్గమ్ మాట్లాడుతూ.. ‘‘21 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ మిసెస్ వరల్డ్ కిరీటం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్’’ అని చెప్పుకొచ్చారు. మొదటి రన్నరప్గా నిలిచిన మిసెస్ పాలినేషియా, సర్గమ్ కౌశల్ మధ్య తుది వరకూ నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ సాగింది. చివరకు న్యాయనిర్ణేతలు సర్గమ్ను విజేతగా ప్రకటించారు.
అవివాహిత యువతుల కోసం.. ఏటా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ల పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో వివాహిత మహిళల కోసం 1984 నుంచి మిసెస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. 2001లో తొలిసారి భారత్కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న భారత్ మహిళగా సర్గమ్ రికార్డు సృష్టించారు. గ్రాండ్ ఫినాలే కోసం ప్రముఖ డిజైనర్ భావనా రావు డిజైన్ చేసిన గులాబీ రంగు స్లీవ్లెస్ గౌనును ధరించారు సర్గమ్.
ఇక జమ్మూ కశ్మీర్కు చెందిన సర్గమ్.. ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పూర్తిచేశారు. ఈ క్రమంలో ఆమె కొంతకాలం.. విశాఖపట్నంలో టీచర్గా పనిచేశారు. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం పలు సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఇక ఆమె భర్త ఆది కౌశల్ ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్ కౌశల్ను అదితీ గోవిత్రికర్ అభినందించారు. ఇక అదితీ గోవిత్రికర్.. తెలుగులో పవన్ కళ్యాణ్తో కలిసి తమ్ముడి సినిమాలో నటించారు. భారతీయ మహిళ సాధించిన ఈ విజయం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.