ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా ముందు కిరోసిన్ పోసి నిప్పంటించి ఆపై బండరాయితో తలపై బాది మొఖాన్ని ఛిద్రం చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని తుమకూరులో చోటు చేసుకుంది. వివరాలు.. దంపతులు నారాయణ(45), అన్నపూర్ణమ్మ తుమకూరు నగరంలోని జయనగర్లో నివాసముండే వారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ర్టీషన్గా పని చేస్తున్నాడు.
భార్య ఎవరితోనో సన్నిహితంగా ఉంటుందని తరచూ ఈ విషయమై ఘర్షన పడేవాడని సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అన్నపూర్ణమ్మ ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకొని నారాయణపై పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అన్నపూర్ణమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.