ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అన్నదమ్ముల మధ్య వైరం చివరికి చంపుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మైలవరం మండలం తొర్రివేముల గ్రామం. గూడెంచెరువు కనకరాజ్, బాలయ్య అనే ఇద్దరూ వ్యక్తులు అన్నదమ్ములు. అయితే గత కొంత కాలం నుంచి పొలం విషయంలో వీరిద్దరి మధ్య తరుచు గొడవలు జరుగుతూనే ఉండేవి.
కాగా గత సోమవారం బాలయ్య తన కుమారుడైన సుదర్శన్ తో పొలం పనులు చేస్తూ బిజీగా ఉన్నాడు. కొంత కాలం నుంచి పగతో ఉన్న అన్న కనకరాజ్ తమ్ముడిని అంతమొందించాలనుకుని కంకణం కట్టుకున్నాడు. దీంతో అదును చూసిన కనకరాజ్ గొడ్డలితో తన తమ్ముడు బాలయ్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఇక గమనించిన కొడుకు వెంటనే తన తండ్రిని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. ఇక కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.