ఆ యువతికి ఐదు నెలల క్రితమే వివాహం అయ్యింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె జీవితం అనుకున్నట్లుగానే సాగింది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సైతం ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర పూజ కూడా చేసింది ఆ యువతి. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఆదివారం ఉదయం కారు షెడ్ లో ఉరేసుకుని కనిపించింది నవ్యశ్రీ(23). కర్ణాటకలోని శివమెగ్గ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కారణాలు ఏమైనప్పటికీ ముక్కుపచ్చలారని జీవితాన్ని అర్దాంతరంగా ముగించింది నవ్యశ్రీ. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని శివమెుగ్గ నగరం అశ్వత నగర్ 5 వ క్రాస్ లో ఆకాశ్-నవ్యశ్రీ దంపతులు కాపురం ఉంటున్నారు. ఆకాశ్, నవ్యశ్రీలకు ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు బాగానే సంతోషంగా ఉన్నారు. ఇక నవ్యశ్రీ సైతం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ సరదాగా ఉండేది. శనివారం సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేసి ఆ వీడియోను తన బ్లాగ్ లో పెట్టింది. కానీ ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే వరకు కార్ షెడ్ లో ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా నవ్యశ్రీ మృతికి గల కారణాలు ఏవీ తెలియలేదు.. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన ఐదు నెలలకే నవ్యశ్రీ ఇలా చనిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.