హోటళ్లకు కరెంటు బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తుంటుంది. కానీ ఓ హోటల్కు వచ్చిన కరెంట్ బిల్ చూసి ఆ హోటల్ యజమాని షాక్కు గురయ్యారు. పూట గడవడం కోసం ఏదో ఓ చిన్న హోటల్ నడుపుకుంటుంటే సెప్టెంబర్ నెలలో వచ్చిన కరెంట్ బిల్ చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్ అధికారులు ఆ యజమానికి వేసిన బిల్లు – వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో కూడా కాదు.. ఏకంగా కోట్లలో వేశారు. ఇలాంటి విషయం తెలిస్తే.. ఎవరు మాత్రం షాక్కు గురి కాకుండా ఉంటారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో వేరే దేశాల్లోనో, రాష్ట్రాల్లోనో కాదు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ప.గో.జిల్లా చింతలపూడిలో సాయి నాగమణి ఓ టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ఈసారి ట్రూఅప్ చార్జీలతో కలిపి వేశారు. అయితే, రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు రావడంతో హోటల్ యజమాని అవాక్కయ్యారు. గత నెలలో 47 వేల 148 రూపాయలు బిల్లు వచ్చిందంటూ హోటల్ యజమాని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్ లో సాంకేతిక లోపం ఉందని అధికారులు కొత్త మీటర్ బిగించడం కొసమెరుపు.
విద్యుత్ మీటర్లకు రీడింగ్ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్ రీడింగ్ మెషీన్లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని చింతలపూడి సెక్షన్లో గత నెలలో మార్చిన మీటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్ ప్రభాకర్ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్ చేశామని వివరించారు.
మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి: