పన్నుల కట్టాల్సిన పనిలేని దేశాల్లో నకిలీ కంపెనీలను సృష్టించి తన నల్లధనాన్ని పొగేసుకున్న వారి వివరాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. 12 మిలియన్ల పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది.
వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. జోర్డాన్ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పత్రాల్లో ఉన్నాయి. పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. భారత్లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు.
2016లో వెలుగులోకి వచ్చిన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా జాగ్రత్తపడ్డారు. అంటే ఆస్తులను చాలావరకు అమ్మేసుకొని, నగదుగా మార్చుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. జోర్డాన్ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ మిత్రుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి.
యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేస్తామని ఐసీఐజే ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఈ ‘పండోరా పత్రాలను’సేకరించారని వెల్లడించింది. ఎంతో శ్రమించి పరిశోధన సాగించారని, ధనవంతుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక రహస్యాలను తెలుసుకున్నారని వివరించింది.