ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఆసుపత్రులకు వచ్చిన రోగులు, వారి బంధువులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవలే వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుంటాయి. ఆసుపత్రి సిబ్బంది చేసే కొన్ని పనులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా ఓ ప్రసూతి ఆసుపత్రి లో ఇద్దరు మహిళ సిబ్బంది బాధ్యత మరచి ప్రవర్తించారు. మరో ఇద్దరు స్నేహితులతో కలసి బీర్లు తాగి విందు చేసుకున్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హనుమ కొండలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా హనుమకొండ ప్రసూతి ఆసుపత్రికి నిత్యం వందలాది మంది గర్భిణులు చికిత్స కోసం వెళ్తుంటారు. పదులు సంఖ్యలో ప్రసవాలు జరిగే వార్డులో తల్లీబిడ్డలు ఉంటారు. దీంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకొని సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే అక్కడ పనిచేసే ఇద్దరు మహిళలు తమ బాధ్యత మరిచి వ్యవహరించారు. తమ స్నేహితులైన మరో ఇద్దరి మహిళలతో కలిసి బీర్లు తాగి విందు చేసుకున్నారు. ఓ గదిలో బీర్లు తాగుతూ చిందులేశారు. పుట్టిన రోజు వేడుకల పేరిట సాయంత్రం సమయంలో ఆసుపత్రిలోని వారి గదిలో సదరు మహిళలు పార్టీ చేసుకున్నారు. వీరు విందు చేసుకొనే దృశ్యాలను అక్కడే ఉన్న రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ ఘటన ఆసుపత్రిలోని ఇతర సిబ్బందికి తెలిసింది.
చివరకు ఆసుపత్రి ఉన్నతాధికారుల వద్దకు ఈ విషయం చేరింది. దీంతో సదరు మహిళ సిబ్బందిని ఆసుపత్రి ఉన్నతాధికారులు పిలిపించి.. హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం. అయితే ఆసుపత్రిలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ విజయలక్ష్మి స్పందించారు. మహిళలు చేసుకున్న విందు పార్టీ విషయం తమ దృష్టికి రాగానే గట్టిగా హెచ్చరించామని ఆమె తెలిపారు. అయితే ఈ వార్త స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.