హైదరాబాద్లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్పై యువకులు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగినదుకు సబ్ ఇంజినీర్ విజయకుమార్పై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్ ఇంజినీర్పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఒక యువకుడు ఏకంగా టేబుల్ ఎక్కి మరి ఇంజనీర్ పై దాడికి యత్నించాడు. ఈ గొడవ మొత్తం అక్కడే ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేశాడు.
కార్వాన్ లో ఇంజనీర్ విజయ్ కుమార్ లైన్ మెన్ తో కలిసి విద్యుత్ బకాయిలను వసూళ్లు చేసేందుకు వెళ్లారు. అక్కడ టపాఛబుత్ర పీఎస్ పరిధిలోని వాల్మీకినగర్లో ఒక ఇంటి బిల్లు చూసి ఆశ్చర్యపోయారు.. ఆ ఇంటివారు గత రెండు సంవత్సరాల నుంచి బిల్లు చెల్లించడం లేదు. దాంతో ఇంటి కరెంటు బిల్లు పదిహేను వేల వరకు పెండింగ్ లో ఉంది. దాంతో ఆ ఇంటి కరెంట్ కట్ చేశారు.. పెండింగ్ బిల్లు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామని చెప్పి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన విశాల్ అనే యువకుడు తల్లి చెప్పిన మాటలు విని ఆగ్రహానికి గురయ్యాడు.
తన స్నేహితులతో కలిసి కార్వాన్లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లి విజయ్కుమార్తో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు బండ బూతులు తిడుతూ టేబుల్ ఎక్కి విజయ్కుమార్ ఛాతితో తన్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. విజయ్కుమార్కు ఛాతిలో తన్నటంతో.. నొప్పిగా ఉండటంతో వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏఈ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.