ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు రెచ్చిపోయారు.. శివాలయం ఆవరణలోనే ఓ పూజారిని రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులకు ఆమె సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు రాత్రి ఆలయం వద్దకు వచ్చి వెతికారు. అక్కడ కనిపించకపోవడంతో వెనుతిరిగి పోయారు. తెల్లవారి జామున కుటుంబసభ్యులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించారు.
ఈ క్రమంలో పూజారి ఆలయ ఆవరణలోనే రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు గుడి ఆవరణలోనే హత్యకు గురి కావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. కాగా, పూజారికి వేరే వారితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.