2020 ఏడాది నుంచి ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్న మహమ్మారి కరోనా.. దాదాపు ప్రపంచ మానవాళి జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మన దేశంలో అయితే జాతీయ రహదారులు వలస కార్మికుల నెత్తుటితో తడిచాయి. ఆకలి చావులు, కరోనా మరణాలతో దేశం శ్మశానంలా మారింది. ఇంతటి దారుణమైన పరిస్థితిల్లో చాలా మంది ఉద్యోగాలు ఊడాయి. పనిలేక చాలామంది ఆకలితో అలమటించారు. ఇలాంటి పరిస్థితిల్లో కూడా మనదేశంలో కొత్తగా 40 మంది సంపన్నులు మరింత శ్రీమంతులుగా మారారు. ఏకంగా బిలీయనర్ల జాబితాలో చేరారు.
గ్లోబల్ ఆక్స్ఫామ్ దావోస్ నివేదిక 2022 ప్రకారం భారత్లో కొత్తగా 40 మంది బిలియనీర్లుగా మారారు. ఆశ్చర్యకరంగా పేదరికం మరింత పెరిగింది. సంపద కొంతమంది దగ్గరే పొగవుతోందని ఈ నివేదిక మరోసారి కుండబద్దలు కొట్టింది. ఈ 40 మంది వద్ద దాదాపు 720 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇది మన దేశంలో ఉన్న 40 శాతం జనాభా వద్ద సంపద కంటే ఎక్కువ. అలాగే మన దేశంలో గత మేలో పట్టణ నిరుద్యోగం 15 శాతం పెరిగిందని, ఆహార అభద్రత మరింత దిగజారినట్లు నివేదిక వెల్లడించింది. మన దేశంలో ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నట్లు ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది.
ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న వారిలో నాలుగింట ఒక వంతు మంది మన దేశంలో నివసిస్తున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని ఉదహరిస్తూ ఆక్స్ఫామ్ తెలిపింది. ఇలా సంపద అంతరంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పన్ను విధానాలే ప్రధాన కారణం అని నివేదిక స్పష్టం చేసింది. మరి భారత్లో కరోనా సమయంలో కూడా కొంతమంది సంపద భారీగా పెరిగి, పేదవారు మరింత పేదవారుగాను మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.