చెన్నై- కరోనాతో పోరాడి మనలను మనమే కాపాడుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ అన్నారు. కరోనా కారణంగా ఊహించని విధంగా జీవితాలు మారాయని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు స్వీయరక్షణ పాటించాల్సిన తరుణం ఆసన్నమైందని కమల్ హాసన్ అన్నారు. తాను కరోనా టీకా రెండు డోస్లు వేసుకున్నానని, తనను ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన చెప్పారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా కరోనా టీకా వేయించుకోవడంతో పాటు చుట్టుపక్కల వారు వేసుకొనేలా ప్రోత్సహించాలని కోరారు. కబసుర కషాయం, వ్యాయామం, యోగా, శ్వాస తీసుకోవడంపై శిక్షణ వంటివి అందరూ చెయ్యాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని.. మనల్ని ఎవరో కాదు.. మనల్ని మనమే కాపాడుకోవాలని కమల్ పిలుపునిచ్చారు. కరోనా ఉదృతి తగ్గే వరకు అంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఐతే తప్ప బయటకు రావద్దని సూచించారు.