ఏవైన వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ధర విషయంలో ఆచీతూచీ వ్యవహరించడం సాధారణంగా జరిగే విషయమే. ధర కాస్ట ఎక్కువైనా, షాప్ వాళ్లు ఎక్కువ ధరకు విక్రయించినా కాస్త అసహనానికి గురవుతుంటాము. కానీ అక్కడ అత్యంత సంపన్నురాలైన ఓ వ్యక్తి కాఫీ ధర విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన వారన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అమెరికాకు చెందిన పెట్టుబడిదారుడు, వ్యాపార వేత్త. ఆయనను స్టాక్ మార్కెట్ పితామహుడిగా పిలుస్తారు. బాల్యంలో పేదరికం అనుభవించిన బఫెట్ డెలివరీ బాయ్ గా, పేపర్ బాయ్ గా తన పదమూడవ ఏట నుంచే సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా చరిత్ర సృష్టించాడు. కాగా కుబేరుడైన బఫెట్ భార్య కాఫీ ధర ఎక్కవైందని కంప్లైంట్ చేసింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవంగానే జరిగిన సంఘటనగా న్యూయార్క్ పోస్ట్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇదేంటీ బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఆమె కాఫీ దర ఎక్కువైందని ఫిర్యాదు చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.
వంద బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న వారెన్ బఫెట్ భార్య తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలెన్ అండ్ కో కంపెనీ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్స్, సీఈఓలకోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుకు హాజరైన బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీ ధర విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్యాంప్ ఓ రిసార్ట్ లో జరుగుతుండగా ఆమె కాఫీ కొనుగోలు చేసింది. కాగా రిసార్ట్ సిబ్బంది ఆ కాఫీకి నాలుగు డాలర్లు తీసుకున్నారు. దీంతో ఆమె కప్పు కాఫీకి నాలుగు డాలర్లు(రూ. 328) వసూలు చేయడమేంటని, వేరే ఇతర షాఫుల్లో నాలుగు డాలర్లకు ఒక పౌండ్ కాఫీ వస్తుందని అసహనం వ్యక్తం చేసింది. ఇదే విషయమై రిసార్ట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది ఆస్ట్రిడ్ బఫెట్. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. బిలియన్ల కొద్ది సంపద ఉన్న బఫెట్ భార్య కాఫీ ధర విషయంలో కంప్లైంట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.