కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ‘వ్యూహం’ మూవీ టీజర్ ఏపీ రాజకీయాలను హీటెక్కించేలా ఉంది. టీజర్ చివర్లో జగన్ పాత్రధారి అజ్మల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది..
ఒకప్పటి క్రియేటివ్ జీనియస్, ఇప్పటి కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ.. అధికార పార్టీని, నాయకుడిని హైలెట్ చేస్తూ మరో రాజకీయ బాణాన్ని సంధించబోతున్నాడు. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి రాజకీయంగా పెద్ద దుమారమే రేపాడు వర్మ. ఆయన సినిమా అనౌన్స్ చేయడం మాత్రమే తెలుసు కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటివి అయితే చకచకా జరిగిపోతుంటాయి. ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘26/11’, ‘రక్తచరిత్ర’ వంటి రియల్ ఇన్సిడెంట్స్తో సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్న ఆర్జీవీ తనలో పస తగ్గిందో లేక తన పెన్నులో పవర్ తగ్గిందో కానీ.. తన స్థాయిని తానే తగ్గించుకునేలా సినిమాలు తీస్తున్నాడంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకునే వర్మ 2019 ఎలక్షన్స్ అప్పుడు క్రియేట్ చేసిన సెన్సేషన్ మరోసారి 2024లో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ‘వ్యూహం’ అనే మూవీతో రాబోతున్నాడు.
శనివారం (జూన్ 24) ‘వ్యూహం’ టీజర్ రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం కెమెరా ఫ్రేమ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్తోనే మేటర్ ఏంటనేది చెప్పే వర్మ ఈ టీజర్ని కూడా తన మార్క్తో తీర్చిదిద్దాడు. ఏపీ రాజకీయాలను హీటెక్కించేలా ఉంది టీజర్. వైఎస్. రాజ శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంతో స్టార్ట్ అయిన టీజర్లో.. జగన్ కుటుంబంలో కన్నీళ్లు, చంద్రబాబు కళ్లల్లో ఆనందం, జగన్, భారతిల మధ్య అనుబంధం, జగన్ని సీబీఐ అరెస్ట్ చేయడం, అదే సమయంలో భారతి రోడ్డు మీద పడిన బాధలు, పదవి కోసం చంద్రబాబు వెయిట్ చేయడం వంటివి కూడా చూపించాడు. దివంగత నేతలు ఎన్టీఆర్, రాజ శేఖర్ రెడ్డి చిత్రపటాలతో మేటర్ అర్థమయ్యేలా తన మార్క్ చూపించాడు వర్మ. అలాగే వైఎస్ ఫోటో ముందు నిలబడి జగన్ – భారతి నవ్వుతూ షేక్హ్యాండ్ ఇచ్చుకోవడం వెనుక ‘వ్యూహం’ ఏంటో వర్మకే తెలియాలి. టీజర్ చివర్లో జగన్ పాత్రధారి అజ్మల్ చేత ‘అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు’ అనే ఒకే ఒక్క డైలాగ్ చెప్పించారు. త్వరలో ‘వ్యూహం’ విడుదల కానుంది.