డైరెక్టర్ కబీర్ గతంలో డ్రగ్స్, ఆల్కాహాల్కి అడిక్ట్ అవడంతో ప్రస్తుతం దాన్నుంచి బయట పడేందుకు రీహాబిటేషన్ సెంటర్లో చేరడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆయన రీహాబిటేషన్ సెంటర్లో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల టాలీవుడ్ ప్రొడ్యూసర్ (కబాలి తెలుగు నిర్మాత) కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేయడం, అతను సెలబ్రిటీలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు సినీ రంగానికి చెందిన పలువురి ఫోన్ నెంబర్లు అతని వద్ద ఉండడంతో వారికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోననే కోణంలో వార్తలు రావడంతో సురేఖా వాణి, జ్యోతి, అషు రెడ్డి వంటి వారు స్పందించడం జరిగింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కేపీ చౌదరి విచారణలో ఇప్పటికే కొందరి పేర్లు వెల్లడించినట్లు సమాచారం. గతంలోనూ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్స్ విచారణకు హాజరవడం తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపింది. శాండల్వుడ్లోనూ హీరోయిన్స్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు. కొద్ది రోజుల వరకు సద్దుమణిగిన మత్తు పదార్థాల తతంగం మళ్లీ వెలుగులోకి రావడంతో సినీ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.
ఇక కన్నడ నిర్మాత టి.చంద్ర శేఖర్ తన వైఫ్ నమిత మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్ అమ్మే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుందని ఆమెతో పాటు ఆమె స్నేహితుడు లక్షీశ్ ప్రభులపై బెంగుళూరు చెన్నమ్మనకెరె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ డైరెక్టర్ రిహాబిటేషన్ సెంటర్లో ఉన్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. సాయి కబీర్ దర్శకత్వంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిర్మించిన ‘టీకూ వెడ్స్ షేరు’ మూవీ జూన్ 23న నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, అన్వీత్ కౌర్ మెయిన్ లీడ్స్. అయితే ఈ ఫిలిం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో కానీ ప్రమోషన్స్లో కానీ సాయి కబీర్ ఎక్కడా కనిపించలేదు. డైరెక్టర్ ఏమైపోయాడబ్బా అని ఆరా తీయగా రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నట్లు తెలిసింది. గతంలో డ్రగ్స్, ఆల్కాహాల్కి అడిక్ట్ అవడంతో ప్రస్తుతం దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.
గతంలో డిప్రెషన్ కారణంగా మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసగా మారాడని తెలుస్తోంది. కాగా 15 ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటున్న కబీర్ పలు సినిమాలకు రైటర్గా వర్క్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కంగనా రనౌత్ ‘రివాల్వర్ రాణి’ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా పరిశ్రమ వర్గాల వారితో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2018లో ఒకసారి ఇలాగే రిహాబిటేషన్ సెంటర్లో చేరాడు. కొద్ది కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రిహాబిటేషన్ సెంటర్కి వెళ్లడం అనేది చర్చనీయాంశంగా మారింది. మంచి భవిష్యత్తు ఉన్న సాయి కబీర్ డ్రగ్స్, ఆల్కాహాల్కి అడిక్ట్ అవడం బాధాకరం, యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, కబీర్ త్వరగా తిరిగి మామూలు స్థితికి రావాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.