కన్నడ చిత్రపరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ అగ్రహీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. కన్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు.
బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో వచ్చిన బెట్టాడ హూవు చిత్రానికి గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. బాలనటుడిగా 13 చిత్రాల్లో నటించి అప్పట్లోనే బెస్ట్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పునీత్ రాజ్కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అయితే పునీత్ గతంలో తను చనిపోతే కళ్ళను డొనేట్ చేస్తానని అన్నారు. పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా అలానే కళ్లు దానం చేశారు.