తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న పవిత్ర లోకేష్ నటిగా మంచి మార్కులే కొట్టేసింది. అనేక సినిమాల్లో నటించిన ఆమె తనదైన నటనతో అందరినీ అలరించారు. ఇకపోతే గత కొంత కాలంగా నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ సన్నిహితంగా ఉంటున్నారని మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదే అంశం గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతోంది. ఈ వార్తలు నరేష్, పవిత్ర లోకేష్ ల వరకూ వెళ్ళింది. తమపై వస్తున్న వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మరోసారి పవిత్ర లోకేష్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని వెబ్ సైట్స్, టీవీ ఛానల్స్ తమపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల, నరేష్ పట్ల కొన్ని వెబ్ సైట్స్, మీడియా ఛానళ్లు ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నాయని.. ఆమె ఫిర్యాదులో తెలిపారు. అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తూ.. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో తెలిపారు. పవిత్ర లోకేష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.