బాహుబలి ముందు వరకు రాజమౌళి అంటే తెలుగునాట వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ డైరెక్టర్. కానీ.., బాహుబలి రిలీజ్ అయ్యాక మాత్రం జక్కన్న స్థాయి, స్థానం మారిపోయింది. బాలీవుడ్ లో మేము తోపులం అని చెప్పుకుని తిరిగే దర్శకులు అందరూ దర్శక ధీరుడికి సలాం చేసేశారు. ఇక అక్కడి స్టార్ హీరోలైన ఖాన్ లు, కపూర్ లైతే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇప్పటికీ రాజమౌళి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అంతటి స్థాయిలో ఉన్న రాజమౌళి మీద ఏ హీరో అయినా సెటైర్ వెయ్యగలడా? మిగతా హీరోలు ఎవ్వరికీ అంతటి దైర్యం లేకపోవచ్చు. కానీ.., జూనియర్ యన్టీఆర్ మాత్రం ఆ సాహసం చేశాడు. యన్టీఆర్, రాజమౌళి స్నేహ బంధం ఈనాటిది కాదు. స్టూడెంట్ నెంబర్1, సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయి. తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోనే ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ పలుమార్లు క్యాన్సిల్ అయ్యింది. దీనితో.. ట్రిపుల్ ఆర్ అప్డేట్ గురించి ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఇక కరోనా సోకడంతో యన్టీఆర్ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియాతో ఫోన్ లో మాట్లాడిన ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ జక్కన్న పై సెటైర్ వేశాడు. ట్రిపుల్ షూటింగ్ సుమారు 19 నెలల పాటు జరిగింది. ఇందులో కొమురం భీమ్ పాత్ర కోసం కండలు తిరిగిన దేహం రెడీ చేయడానికి నాకు 18 నెలలు సమయం పట్టింది. చాలా కఠినమైన ట్రైనింగ్ తరువాత ఇది సాధ్యం అయ్యింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయని యన్టీఆర్ చెప్పుకొచ్చాడు. కానీ.., మీడియా వారు ఇంతకు మించిన అప్డేట్స్ కోరడంతో తారక్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ”నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒకవేళ చెబితే రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివి నాకోసం గొడ్డలి పట్టుకుని వచ్చేస్తాడు” అని తారక్ చమత్కరించాడు. తారక్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి అభిమాన హీరో యన్టీఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.