చివరి రోజుల్లో ఆమె దయనీయ స్థితి చూసి చలించి, వారెవరూ ఎందుకు సాయం చేయలేదు? అని పలు రకాలుగా వార్తలొచ్చాయి కానీ ఈ తరం వారికి తెలియని నిజం ఒకటుంది.
సినిమా వాళ్ల జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు. లోపల ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. కోట్లు కూడగట్టుకుని, నమ్మిన వారి చేతిలో మోసపోయి, ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయి, చివరి రోజుల్లో అనాథగా పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ‘మహానటి’ సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. ఎంతో ఆడబంరంగా బ్రతికి, చివరి రోజుల్లో ఎవరి ఆదరణకూ నోచుకోక దయనీయంగా ముగిసిందామె జీవితం. డబ్బు, మనుషుల విషయంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు చూసి తెలుసుకోవచ్చు. ఆ ‘మహానటి’ లైఫ్ హిస్టరీకి సంబంధించి కొన్ని బుక్స్ వచ్చాయి. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. మరి చివరి రోజుల్లో ఆమె దయనీయ స్థితి చూసి చలించి వారెవరూ ఎందుకు సాయం చేయలేదు? అని పలు రకాలుగా వార్తలొచ్చాయి కానీ ఈ తరం వారికి తెలియని నిజం ఒకటుంది. తోటి నటి, ఒకప్పుడు బాగా బ్రతికి, ధానధర్మాలు చేసి, చివరికి ఉన్నదంతా పోగొట్టుకున్న సావిత్రికి వారంతా ఏదో రకంగా సాయం చేసేవారట. ఇప్పటిలా అప్పట్లో సోషల్ మీడియా అనేది లేకపోవడం, సాయం చేసిన వారు ఈ విషయాన్ని అంతగా ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఈ న్యూస్ బయటకి రాలేదు.
నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ ఏఎన్నార్ ఇద్దరూ చివరి రోజుల్లో సావిత్రి ఇంటికి నెల నెలా కొంత మొత్తం డబ్బులు పంపేవారట. ఇక 1980 టైంలో విజయవాడలోని అన్నపూర్ణ హోటల్లోనే నెలకి 10 రోజులు బస చేసేవారట సావిత్రి. అప్పటికే ఆమె ఆస్తి మొత్తం కోల్పోయి.. ఉన్న బంగారం, వజ్రాలు కుమార్తె విజయ చాముండేశ్వరికి ఇచ్చేశారట. తమిళ స్టార్ జెమినీ గణేశన్, సావిత్రిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడమే కాక, ఆమె ఆస్తి మొత్తాన్ని లాగేసుకున్నాడని ప్రచారం జరిగింది. సావిత్రి సున్నిత మనస్కురాలు కావడంతో మానసిక ఆటుపోట్లను భరించలేక మద్యానికి బానిసై అనారోగ్యంతో కన్నుమూశారు.