తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామ సుందరి మరణించారు. 81 ఏళ్ల వయసులో ఆమె చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. చెన్నైలోని టి.నగర్లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న తన స్వగృహంలో శివకామసుందరి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొడాలి నాని పాలాభిషేకం!
హన్మకొండలో జన్మించిన శివకామ సుందరికి, గొల్లపూడి మారుతీరావుతో 1961లో వివాహమైంది. ఇక రెండేళ్ల క్రితం గొల్లపూడి మారుతీరావు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతలుకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఒక కుమారుడు వైజాగ్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు తెలిపారు.