దర్శకుడు అనుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పిట్టగోడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ దర్శకుడు.. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక తొలిసారి క్యాష్ ద్వారా అనుదీప్లోని కామెడీ యాంగిల్ అందరికి తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూలన్ని ప్రేక్షకులకు తెగ నచ్చాయి. ఈ మధ్య కాలంలో దర్శకుల్లో ఈ రేంజ్ అభిమానాన్ని సంపాదించుకుంది అనుదీప్ మాత్రమే. ఇక తాజాగా శివ కార్తీకేయన్తో ప్రిన్స్ సినిమా తీశాడు. ఈ సినిమా జాతి రత్నాలు సినిమా అంత పెద్ద విజయం సాధించలేదు. తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోగా.. తమిళ్లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ అనుదీప్ని ఇంటర్వ్యూని చేసింది. ఇది అనుదీప్లోని మరో కోణాన్ని, కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. చూడ్డానికి ఏదో సాధారణమైన వ్యక్తిలా కనిపించే అనుదీప్కు సమాజం, మహిళ పట్ల ఎంతటి గౌరవ భావం ఉందో.. ఆయన ఆలోచనలు ఎంత లోతైనవో తెలిసి వచ్చింది.
ఇక ప్రేమతో ఇంటర్వ్యూ సందర్భంగా అనుదీప్ తనకున్న ఓ వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. తనకు హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే డిజార్డర్ ఉందని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్ లక్షణాలుంటాయి కానీ అర్ధం చేసుకోలేరని తెలిపాడు. తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను అన్నాడు. తనకు గ్లూటెన్ పడదని.. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదని.. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్ కామ్ అవుతుందని తెలిపాడు. ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా పని చేస్తాయని.. ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేరని.. ఈ వ్యాధి ఉన్నవారు.. చాలా త్వరగా అలసిపోతారని చెప్పుకొచ్చాడు.
అయితే దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదని.. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పాడు అనుదీప్. మరి ఈ వ్యాధి ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి పరిశోధించి.. ప్రస్తుతం అవే పాటిస్తున్నాను అని చెప్పాడు. భవిష్యత్తులో హెచ్ఎస్పీ గురించి సినిమా తీసే ఆలోచన ఉందని.. దాని వల్ల కొందరైనా హీల్ అవుతారని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అనుదీప్. దీంతో పాటు తన పర్సనల్ లైఫ్, తన అలవాట్లు వంటి వాటి గురించి ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చాడు అనుదీప్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరలవుతోంది.