తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి సంఘవి తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు వెండితెర మీద ఓ వెలుగు వెలిగి, కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్కే అంకితమైపోయిన స్టార్స్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కనిపెట్టగలుగుతున్నాం. ప్రేక్షకాభిమానుల కోరిక మేరకు ఇప్పటికే కొందరు నటీమణులు రీ ఎంట్రీ ఇచ్చారు. మరికొందరు సీరియళ్లతోనూ మెప్పిస్తున్నారు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది సెలబ్స్ నెటిజన్ల కంటపడుతున్నారు. నటి లయ ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తూ ఎంతలా సందడి చేస్తుందో తెలిసిందే. రీసెంట్గా సీనియర్ నటి సంఘవి గురించిన న్యూస్ వైరల్ అవుతోంది.
సంఘవి.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమైంది. ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిగా సందడి చేస్తుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. అజిత్ నటించిన ‘అమరావతి’ అనే తమిళ్ మూవీతో కెరీర్ స్టార్ చేసి కోలీవుడ్ ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్లతో కలిసి నటించింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజ శేఖర్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. చివరిగా ‘కొలాంజి’ అనే తమిళ్ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని భార్యగా కనిపించింది. 2016లో ఐటీ సంస్థ అధినేత ఎన్.వెంకటేష్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప ఉంది.
వివాహం తర్వాత పెద్దగా బయటకెక్కడా కనిపించలేదు సంఘవి. ఇటీవల ఆమె ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయిందామె. జనాలు ఆమెను కనిపెట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడిలోనుండి బయటకు వచ్చిన తర్వాత మీడియా సంఘవిని పలకరించగా.. ప్రస్తుతం టీవీషోల జడ్జిగా చేస్తున్నానని, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చారు సంఘవి. ఆమె లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.