టాలీవుడ్ లో ఉన్న పలువురు స్టార్ హీరోలు తప్పితే మిగిలిన చాలామంది హీరోల దగ్గర నుంచి నటీనటుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ పైకొచ్చిన వాళ్లే. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ స్టేజీ వరకు వచ్చుంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడే వాటిని బయటపెడుతూ ఉంటారు. అలా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విషయాల్ని కూడా రివీల్ చేస్తుంటారు. తాజాగా అలాంటిదే నటుడు అజయ్ బయటపెట్టాడు. హోటల్ లో ఓ టైంలో గిన్నెలు కూడా కడిగానని చెప్పాడు. ప్రస్తుతం ఆ విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటుడు అజయ్ గురించి చెప్పుకోవాలంటే చాలా స్పెషల్. ‘ఖుషి’ లాంటి సినిమాలో ఏదో అనామక రోల్ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం పలు భాషల్లో కీ రోల్స్ చేయడం వరకు వచ్చాడు. ముఖ్యంగా విలన్ తరహా పాత్రలకు కేరాఫ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇతడే. రాజమౌళి-రవితేజ కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’లో అయితే అత్యంత భయంకరమైన విలన్ గా చేసి, ప్రేక్షకుల్ని భయపెట్టాడు. ఆ తర్వాత ఇష్క్, దిక్కులు చూడకు రామయ్యా లాంటి చిత్రాల్లో పలు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసినప్పుటికీ విలన్ గానే బాగా గుర్తుండిపోయాడు.
తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంకి వచ్చిన అజయ్.. తన లైఫ్ లో జరిగిన పలు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాడు. ‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత పిల్లలు తన దగ్గరకు రావడానికి భయపడ్డారని అన్నాడు. పొడుగ్గా ఉన్నాననే ఇండస్ట్రీకి వచ్చినట్లు పేర్కొన్నాడు. అలానే విలన్ రోల్స్ చేసేటప్పుడు కాస్త పొడుగున్న హీరోస్ రావాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానని చెప్పాడు. ఎందుకెళ్లానో తెలియకుండానే ఓ టైంలో నేపాల్ వెళ్లానని, తీరా డబ్బులు అయిపోవడంతో ఓ టిబెటన్ రెస్టారెంట్ లో గిన్నెలు కూడా కడిగానని అజయ్ చెప్పుకొచ్చాడు. అలానే ఓ సినిమా షూటింగ్ లో కొద్దిలో చనిపోవడం నుంచి తప్పించుకున్నానని అన్నాడు. ఇక రేప్ సీన్స్ అప్పుడప్పుడు కూడా తనకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదని అజయ్ చెప్పుకొచ్చాడు.