అయ్యప్ప స్వామి పుట్టుకను కించపరుస్తూ భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో అయ్యప్ప స్వాములు బైరి నరేష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి సైతం పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బైరి నరేష్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ వ్యవహారం సద్దుమణుగుతున్న సందర్భంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రేంజర్ల రాజేష్ వ్యాఖ్యలపై బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాసర బంద్కు పిలుపునిచ్చారు.
వ్యాపారస్తులు, ప్రజలు సైతం ఈ బంద్కు మద్దతు తెలిపారు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. చదువుల తల్లి సరస్వతి దేవిపై రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేయటంపై చర్యలు తీసుకోవాలని అర్చక, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అతడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నాయి. ఆలయంలో పూజలు నిలిపి వేసి ప్రధాన ద్వారం ముందు ఆందోళనకు సైతం దిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి.. సరస్వతీ దేవి ఇచ్చిన జ్ఞానంతోటే చదువులు చదివి.. ఆమెపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కామ రూపిని అనే ఐటమ్ గర్ల్ అనే విధంగా వ్యాఖ్యలు చేయటం బాధాకరం. ఇది కేవలం బాసరకు సంబంధించినది కాదు..
యావత్ హిందూ ప్రపంచానికి సంబంధించింది. అమ్మవారు కోర్కెలు తీర్చే తల్లి. అందరికి జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారే.. ఇవాలా మనం మాట్లాడే ప్రతీ మాట ఆమె అనుగ్రహమే. అన్ని అవయవాలు చక్కగా ఉండటం ఆమె అనుగ్రహం. మాట్లాడటం ఆమె అనుగ్రహం. విచక్షణా జ్ఞానం ఇచ్చేది కూడా ఆ తల్లే. అలాంటి అమ్మవారిపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము’’ అని అన్నారు. బంద్ కారణంగా బాసర పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.